తల్లీ, కొడుకులు పోటీచేయటం ఖాయమేనా ?

తెలుగుదేశం పార్టీకి సంబంధించి  క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే ఉంది. తాజాగా పరిటాల శ్రీరామ్ చేసిన హెచ్చరికలు విన్న తర్వాత పార్టీలో అందరూ ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఇంతకీ శ్రీరామ్ చేసిన హెచ్చరిక ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో ధర్మవరంలో పోటీ చేయటానికి తనకు టికెట్ ఇవ్వకపోతే రాజకీయాల నుండే శాశ్వతంగా తప్పుకుంటానని ఏకంగా చంద్రబాబునాయుడుకే అల్టిమేటం జారీ చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

శ్రీరామ్ ఎక్కడా చంద్రబాబు పేరెత్తలేదు. కానీ టీడీపీలో టికెట్లు కేటాయించాల్సింది, బీఫారమ్ లపై సంతకాలు పెట్టాల్సింది చంద్రబాబే కదా. కాబట్టే శ్రీరామ్ వార్నింగుపై ఇంతటి ప్రచారం జరుగుతోంది. నిజానికి ధర్మవరంలో పోటీ విషయమై 2019లోనే పరిటాల సునీత, శ్రీరామ్ చాలా ప్రయత్నాలే చేశారు. అయితే అప్పటి సిట్టింగ్ ఎంఎల్ఏ గోనుగుంట్ల సూర్యనారాయణ(వరదాపురం సూరి)ను కాదని శ్రీరామ్ కు టికెట్ ఇవ్వలేకపోయారు. దాంతో తన తల్లి సునీత పోటీ చేయాల్సిన రాప్తాడులో తాను పోటీ చేశారు. రాప్తాడులో శ్రీరామ్, ధర్మవరంలో సూరి ఇద్దరూ ఓడిపోయారు.

ఎప్పుడైతే టీడీపీతో పాటు తాను కూడా ఓడిపోయారో వెంటనే సూరి టీడీపీకి రాజీనామా చేసేసి బీజేపీలో చేరిపోయారు. అప్పటి నుండి ధర్మవరంపై శ్రీరామ్ కన్నుంది. ఎలాగూ నియోజకవర్గంలో పార్టీకి సరైన నాయకుడు లేడు కాబట్టి చంద్రబాబు కూడా శ్రీరామ్ నే ఇన్చార్జిగా చేసేశారు. అంటే ధర్మవరంలో శ్రీరామ్ పోటీకి దాదాపు లైన్ క్లియర్ అనే చెప్పాలి. మరలాంటపుడు టికెట్ విషయంలో శ్రీరామ్ వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నదే ఎవరికీ అర్థం కావడం లేదు. ఇదే సమయంలో రాప్తాడులో మళ్ళీ సునీతే పోటీ చేయటానికి రెడీ అవుతున్నారు.

రాప్తాడులో తన తల్లి, ధర్మవరంలో తాను పోటీ చేయటం ఖాయమంటు శ్రీరామ్ బాహాటంగానే ప్రకటించేశారు. దాంతో తల్లీ, కొడుకులు ఇద్దరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయమనే అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక సమస్యుంది. తల్లీ, కొడుకులు ఇద్దరు పోటీ చేస్తే రెండు నియోజకవర్గాలను సమన్వయం చేసుకునేది ఎవరు ? ఇద్దరిలో ఒకళ్ళు మాత్రమే పోటీలో ఉంటే రెండో వాళ్ళు ప్రచారం, నేతలు, కార్యకర్తల అవసరాలను చూసుకునేందుకు వీలుంటుంది. అలాకాదని ఇద్దరు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే సమన్వయం చేసుకునే అవకాశాలు చాలా కష్టమైపోతాయి. మరి ఈ విషయాన్ని తల్లీ, కొడుకులు ఆలోచించకుండానే ఉంటారా ?