పిల్ల‌ల్ని కంటూనే ఉండండి!.. ఎంఐఎం నేత కామెంట్లు

రాజకీయాల్లో ఒక‌రిని మించి ఒక‌రు.. వివాదాల‌కు కేంద్రంగా మారుతున్నారు. నువ్వు రెండంటే.. నేను నాలుగంటా.. అన్న‌ట్టుగా.. నాయ‌కుల వివాదాల‌తో రాజ‌కీయాలు ర‌క్తి క‌డుతున్నాయి. తాజాగా హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎంకు చెందిన కీల‌క నాయ‌కుడు.. తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. ఓవైసీని ప్రధానిగా చూడాలంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని ముస్లింలకు ఉచిత సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.

యూపీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నాయి. ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం.. యూపీలో పాగా వేయాలని చూస్తున్నారు. సమావేశాలు నిర్వహిస్తూ ముస్లిం సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుస్తున్నారు. జిల్లాలు, న‌గ‌రాలు..ప ట్ట‌ణాల‌ను చుట్టేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను మ‌చ్చిక చేసుకునేందుకునాయ‌కులు పోటీ ప‌డుతున్నారు.

ఈ క్రమంలోనే ఏఐఎంఐఎంకి చెందిన జిల్లా అధ్యక్షుడు గుఫ్రాన్ నూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ వీడియోలో.. ఓవైసీని ప్రధాన మంత్రి చేద్దామ‌ని.. అప్పుడే .. మ‌న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని.. ఆయ‌న వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఓవైసీని పీఎంను చేసేందుకు ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కనాలని సలహా ఇచ్చారు.

ఏఐఎంఐఎం అలీగఢ్ జిల్లా అధ్యక్షుడు గుఫ్రాన్ నూర్ ఆ వీడియోలో మాట్లాడుతున్నారు.’ పిల్లలు లేకపోతే మనం రాజ్యాధికారం ఎలా సాధిస్తాం? ఓవైసీ సాబ్ ఎలా ప్రధాని అవుతారు. శైకత్ సాబ్ ఎలా ముఖ్యమంత్రి అవుతారు? దళితులు, ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కనకూడదని కట్టడి చేస్తున్నారు. అలా ఎందుకు? అది షరియత్కు వ్యతిరేకం.’ అని పేర్కొన్నారు. ఇక‌, దీనిని బీజేపీ త‌న‌కు అనుకూలంగా మార్చుకుని.. ముస్లిమేత‌ర వ‌ర్గాల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయ‌డంతో ఓవైసీ త‌ల‌ప‌ట్టుకున్నారు.