ఇదేందయ్యా ఇది… వైసీపీ ఎమ్మెల్యేలు ఇట్టా రెచ్చిపోతున్నారు

ఏపీలో విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ ఎవరి మాట వినరు అంటుంటారు కానీ… జగన్ మాటే నేతలు వినడం లేదా అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ పార్టీలో వరుసగా నిరసనల గళం వినిపిస్తోంది. ఇప్పటికే గత నెలరోజుల్లో నలుగురు ఎమ్మెల్యేలు పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేయగా… తాజాగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి జగన్ పాలనలో అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర నిరసన వ్యక్తంచేశారు.

ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఇసుక గురించి జెడ్పీ సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఆయనేమీ రెబల్ ఎమ్మెల్యే కాదు. కానీ ఇసుక దొరక్క వస్తున్న ఫిర్యాదుల్లో తాము ఏమీ చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పరువు పోయే పరిస్తితి ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. వాస్తవానికి ఇసుక వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతోంది.

ఎవరికి వారు ఇసుకను బుక్ చేస్తే ఇంటికి వచ్చేలా గవర్నమెంటు పాలసీ తెచ్చింది. అయితే.. అయితే, ఇందులో రెండు రకాల సమస్యలు వస్తున్నాయి. బుక్ చేద్దామనుకునేలోపు అవుటాఫ్ స్టాక్ రావడం ఒక సమస్య అయితే… బుక్ చేసిన ఇసుక యార్డుకు చేరడం లేదనేది మరో సమస్య. కానీ బ్లాకులో కొనడానికి ఎంత కావాలంటే అంత ఇసుక దొరుకుతోందట. ఇదెలా సాధ్యం. దీంతో మా పరువు పోతుందని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఇలాంటిదే కాకపోవచ్చు సమస్య మాత్రం మాత్రం ఇసుకే అంటూ కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు. కోనసీమలో పది ఇసుక ర్యాంపులు ఉన్నా ప్రారంభించడం లేదని, దీంతో ఇసుక దొరకడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈయన ఏకంగా ఏపీఎండీసీ మీద ఆరోపణలు చేశారు. ఇది ఏపీఎండీసీ తప్పే అని కుండబద్ధలు కొట్టారు.

కోన సీమలో ఇసుక దండిగా ఉన్నా… ఇల్లు కడదామంటే దొరకడం లేదు. ఇదొక్కటే కాదు.. బ్రిక్ ఇండస్ట్రీ కి ఇచ్చే సబ్సిడీ కూడా అధికారులు రాకుండా చేస్తున్నారు. పంట పొలాల్లో రైతులు మట్టి తరలిస్తున్నా కేసులు పెడతున్నారు. ఏం తమాషాగా ఉందా…రైతులపై కేసులు పెట్టడానికి ముందు నాపై పెట్టండి అంటూ జగ్గిరెడ్డి చిర్రుబుర్రులాడారు.

మొన్నటికి మొన్న ఆనం అధికారులపై మండిపడిన విషయం తెలిసిందే. నీళ్లు అమ్ముకున్నారని కొంతకాలంగా వస్తున్న ఆరోపణలను ఆయన తన వ్యాఖ్యల ద్వారా నిజం చేశారు. మరో ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి… మాకు నీళ్లు రావడం లేదు అధికారులే కారణం అంటూ జెడ్పీ ఆఫీసు ముందు ధర్నా చేశారు. ఇలా తెలుగుదేశం ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా వైసీపీ ఎమ్మెల్యేల నుంచి పాలనపై ఫిర్యాదులు రావడం ఆసక్తికరం.

అయితే, విశ్లేషకులు ఏమంటున్నారంటే… వ్యవస్థలో తప్పులు పార్టీపై దుష్ప్రబావం చూపకుండా ఎమ్మెల్యేలు అడ్డుపడి పార్టీని కాపాడుతున్నారని… ఇది ఒకరకమైన రాజకీయమే అని అంటున్నారు. మరీ వరుసగా ఇంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన గళం విప్పడం… అది కూడా 151 మంది ఉన్న సమయంలో అంత ధైర్యం చేయరు. కాబట్టి ఇది ఒక అండర్ స్టాండింగ్ తో పార్టీని రక్షించడానికి చేస్తున్నా రాజకీయం అన్న ఆరోపణలు లేకపోలేదు.