కౌశిక్‌కు ఇలా.. గెల్లుకు అలా!

ఏదో అనుకుంటే.. ఇంకేదో అయిందే.. ఇప్పుడు టీఆర్ఎస్ ప‌రిస్థితి అలాగే ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో విజ‌యం కోసం అన్ని ర‌కాల ఎత్తులు వేసిన‌ప్ప‌టికీ విజ‌యం ద‌క్క‌క‌పోగా.. ఇప్పుడు ఆ ఫలితాలే కేసీఆర్‌ను ఇబ్బందుల్లో ప‌డేసేలా ఉన్నాయి. ఆ ఎన్నికలో విజ‌యం కోసం వ్యూహాలు అమ‌లు చేసిన కేసీఆర్‌.. అందుకోసం హుజూరాబాద్‌లోని ఇత‌ర పార్టీల ప్ర‌ధాన నేత‌ల‌ను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. విద్యార్థి నేత‌, బీసీ నాయ‌కుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌ను బ‌రిలో దించారు. ఇప్పుడు ఓట‌మి ఎదుర‌వ‌డంతో ఢీలా ప‌డ్డ కేసీఆర్‌కు.. ఇప్పుడు ఈ నాయ‌కుల స‌మ‌స్య త‌ల‌నొప్పిగా మారింద‌నే అభిప్రాయాలున్నాయి. ఓడాపోతార‌ని తెలిసే గెల్లును ఎన్నిక‌ల్లో నిలిపి బ‌లి ప‌శువుని చేశార‌ని, ఆయ‌నకు త‌గిన ప‌ద‌వి ఇవ్వాల‌ని ఇప్పుడు హుజూరాబాద్ బీసీ నేత‌లు యాద‌వ నాయ‌కులు కేసీఆర్‌ను కోరుతున్నారు.

మ‌రోవైపు పార్టీలోకి చేర్చుకున్న ఎల్‌.ర‌మ‌ణ, కౌశిక్ రెడ్డి, పెద్దిరెడ్డి, మోత్కుప‌ల్లి న‌ర్సింహులు లాంటి నాయ‌కులు ఎమ్మెల్సీ ప‌ద‌వి కోసం ఆశ‌ప‌డుతున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. శాస‌న‌స‌భ్యుల కోటా కింద ఆరు శాస‌న‌మండ‌లి స్థానాల‌కు న‌వంబ‌ర్ 29న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నెల 9న నోటిఫికేష‌న్‌తో ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. ఎమ్మెల్యేల కోటాలో ప్ర‌స్తుతం ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆకుల ల‌లిత‌, గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, ఫ‌రీదుద్దీన్‌, నేతి విద్యాసాగ‌ర్‌, క‌డియం శ్రీహ‌రి, బోడ‌కుంటి వెంక‌టేశ్వ‌ర్ల ఆరేళ్ల ప‌దవీ కాలం ఈ ఏడాది జూన్ 3న పూర్త‌యింది. సాధార‌ణంగా ప‌ద‌వీ కాలం పూర్త కాక‌ముందే ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తి చేయాలి. కానీ క‌రోనా కార‌ణంగా అప్ప‌ట్లో వాయిదా వేసింది. ఇప్పుడు ఈ ఎన్నిక‌లు పూర్తిచేశాక స్థానిక సంస్థ‌ల రెండు ఎమ్మెల్సీ స్థానాల‌కు నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీంతో ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌ కోసం ఆశావ‌హులు ఎదురు చూస్తున్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక ముందు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి చేరిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తామ‌ని కేటీఆర్ గ‌తంలోనే ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఆ ప‌ద‌వి కోసం ప్ర‌తిపాద‌న‌లు కూడా పంపించారు. కానీ నేర చ‌రిత్ర ఉన్న కౌశిక్ రెడ్డి సామాజిక సేవ కోటాలో ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వ‌డంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ గ‌వ‌ర్న‌ర్ ఆ ప్ర‌తిపాద‌న‌లు పెండింగ్‌లో పెట్టింది. దీంతో ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ కోటాలో గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌ను ఎమ్మెల్సీ చేయాల‌ని కేసీఆర్ ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ప‌ద‌విలోకి తీసుకోవాల‌ని ప్ర‌ణాళిక సిద్ధం చేశార‌ని స‌మాచారం. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట‌మి నేప‌థ్యంలో కౌశిక్ రెడ్డిపై కేసీఆర్ ఆగ్ర‌హంతో ఉన్నార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వ‌డంపై కేసీఆర్ ఆలోచిస్తున్న‌ట్లు తెలిసింది.

ఇక గెల్లును శాస‌న మండ‌లికి పంపించ‌డం ద్వారా ఎన్నిక‌లో ఓట‌మితో అసంతృప్తితో ఉన్న‌ర యాద‌వ సామాజిక వ‌ర్గంతో పాటు బీసీ సంఘాల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌చ్చ‌ని కేసీఆర్ అనుకుంటున్నట్లు స‌మాచారం. మ‌రోవైపు గెల్లును ఎమ్మెల్సీగా తీసుకుని ఆపై మంత్రిగా కూడా చేస్తార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ తిరుగులేని నేత‌గా మారాలంటే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం ప‌ని చేశార‌నే అభిప్రాయాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్ర‌ణాళిక సిద్ధం చేశార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.