కేసీయార్ కు అసెంబ్లీ మే సవాల్

అదేనండి మామూలుగా బస్తీ మే సవాల్ అని అంటుంటారు కదా. దాన్నే కాస్త మార్చి అసెంబ్లీ మే సవాల్ అన్నాము. ఎందుకంటే కేసీయార్ నిలువెల్లా ద్వేషించిన ఈటల రాజేందర్ నే జనాలు హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో మళ్ళీ ఎన్నుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఈటల గెలవకూడదనే టార్గెట్ తో కేసీఆర్ చేయని పని లేదు. ప్రలోభాలు, బెదిరింపులు, కొనుగోళ్ళు, నియామకాలు, పంపకాలు, హామీలు, ఒత్తిళ్ళు దేనికి అవకాశం ఉందంటే అదంతా చేశారు. విచిత్రమేమిటంటే ఇన్ని చేసిన కేసీఆర్ జనాలు మనసుల్లో ఏముందో మాత్రం తెలుసుకోలేకపోయారు.

కేసీయార్ ఎన్ని చేస్తే మాత్రం ఏమి లాభం జనాల మనస్సుల్లో ఈటల ఉన్నపుడు. అందుకనే ప్రలోభాలకు లొంగిపోయారు, బెదిరింపులకు బెదిరిపోయారు, డబ్బులిస్తే తీసుకున్నారు, ఒత్తిళ్ళు పెడితే తట్టుకున్నారు. పంపకాల్లో ఎవరి వాటా ఏమిటో తేల్చుకున్నారు. అంతా చేసి చివరకు ఈటలకు ఓట్లేసి గెలిపించుకున్నారు. అంతా బాగానే ఉంది కానీ వాట్ నెక్ట్స్ ? అదే అసెంబ్లీలో కేసీయార్ ఏమి చేస్తారు ? నిలువెల్లా ద్వేషించిన ఈటలనే చివరకు అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ఫేస్ చేయాలి.

సమావేశాల్లో ఈటల ప్రశ్నలకు కేసీయార్ సూటిగా చూసి సమాధానాలు చెప్పగలరా ? ఇంత జరిగిన తర్వాత ఈటల మాత్రం కేసీయార్ నో లేకపోతే మిగిలిన మంత్రులనో ఊరికే ఎందుకు వదిలేస్తారు ? కేసీఆర్ తో పాటు ప్రతిమంత్రిలోను ఉన్న బొక్కలన్నీ ఈటలకు బాగా తెలుసు కదా ? ఇపుడా బొక్కలను తవ్వి తీయకుండా ఉంటారా ? అసెంబ్లీ వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి చాకిరేవు పెట్టకుండానే ఉంటారా ?

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ తరపున అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజాసింగ్, రఘునందనరావు, ఈటల ముగ్గురూ కేసీయార్ పై మహా కసిగా ఉన్నవాళ్ళే. ఒకపుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే కేసీయార్ అండ్ కో చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇపుడు బీజేపీ ఎంఎల్ఏల కారణంగా ఇబ్బందులను ఫేస్ చేయకతప్పదు. రఘునందనరావు అయినా ఈటల అయినా పాయింట్ బై పాయింట్ ప్రభుత్వాన్ని నిలదీసేంత సన్నా ఉన్నవాళ్ళే. రఘునందన్ అంతగా ఈటల మాటకారి కాకపోవచ్చు కానీ నిన్నటి వరకు ఇదే ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తే కాబట్టి అందరి బొక్కలు కచ్చితంగా ఈటలకు తెలిసే ఉంటాయి.

ఏదేమైనా తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్న కేసీయార్ తనకు తానే శతృవులను తయారు చేసుకుంటున్నారు. ఇపుడు ఈటల టీఆర్ఎస్ లో నుండి బయటకు వచ్చినట్లే ఒకపుడు రఘునందన్ కూడా టీఆర్ఎస్ నేతే. పార్టీలో ఇమడలేకే బయటకు వెళ్ళిపోయి తర్వాత బీజేపీలో చేరారు. ఆ తర్వాత దుబ్బాకలో జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి మీదే గెలిచారు. మొత్తానికి తన శతృవులందరినీ కేసీయార్ అసెంబ్లీలో ఎలా ఫేస్ చేస్తారో చూడాలి.