హుజూరాబాద్ ఫైనల్ రిజల్ట్ ఇదేనా ?

తెలంగాణలో ఎంతో ఉత్కంఠకు గురి చేస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక అంతిమ ఫలితం ఎలాగుండబోతోందనేది సస్పెన్సుగా మారిపోయింది. రోజుకో మలుపు తిరుగుతున్న ఉపఎన్నిక తీరుతో బెట్టింగుల జోరు విపరీతంగా పెరిగిపోతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమైతే ఇప్పటికే వందల కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగిందట. పోలింగ్ తేదీ 30 దగ్గరవుతున్నకొద్దీ బెట్టింగ్ జోరు మరింతగా పెరిగిపోతోంది.

అందరిలోను అనేక రూపాల్లో టెన్షన్ పెంచేస్తున్న ఉప ఎన్నికలో అంతిమ విజయం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దే అనే సర్వే ఒకటి వెలుగుచూసింది. కొందరు జర్నలిస్టులు నియోజకవర్గంలో బాగా తిరిగి ఓ సర్వే నిర్వహించారట. ఆ సర్వే నివేదిక ప్రకారం తమ ట్రంప్ కార్డుగా అనుకుంటున్న దళిత బంధు పథకమే చివరకు టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాసయాదవ్ ను గట్టి దెబ్బ తీస్తోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజానికి ఉపఎన్నికలో గెలవటం కోసమే కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే నియోజకవర్గంలోని 2.3 లక్షల ఓట్లలో దళితుల ఓట్లు సుమారు 25 వేలున్నాయి. మెజారిటీ ఓటర్లలో మొదటి స్ధానం బీసీలదే. తర్వాత రెడ్లు, ఎస్టీలు ఇతర కులాల వారుంటారు. ప్రత్యేకించి ఎస్సీల కోసమని దళిత బంధు పథకాన్ని అమలు చేయటంతో మిగిలిన సామాజిక వర్గాలు ప్రత్యేకించి బీసీలు, ఎస్టీలు బాగా మండిపోతున్నారట. పోనీ దళిత బంధు పథకాన్నైనా సక్రమంగా అమలు చేస్తున్నారా అంటే అదీ లేదు.

పథకంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో పడుతున్న డబ్బు వెంటనే వెనక్కు వెళ్ళిపోతోందట. నియోజకవర్గంలో ఇప్పటికి 200 మందికి పైగా లబ్దిదారుల ఖాతాల నుండి డబ్బులు వాపసు వెళ్ళిపోయాయని దళితులే ఆరోపిస్తున్నారు. అందుకనే కేసీయార్ కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నియోజకవర్గంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక సర్వే విషయానికి వస్తే దళితుల్లో టీఆర్ఎస్ కు 50 శాతం, బీజేపీకి 35 శాతం ఓట్లు పడతాయని కాంగ్రెస్ కు 15 శాతం ఓట్లు వస్తాయట.

రెడ్డి సామాజిక వర్గం ఓట్లలో బీజేపీకి 60 శాతం, టీఆర్ఎస్ కు 30, కాంగ్రెస్ కు 10 శాతం ఓట్లొస్తాయని తేలిందట. ఎస్టీల్లో బీజేపీకి 70 శాతం, టీఆర్ఎస్ కు 20, కాంగ్రెస్ కు 5 శాతం ఓట్లు వస్తాయట. ముస్లింల్లో కాంగ్రెస్ కు 40, టీఆర్ఎస్ కు 40 శాతం మిగిలిన 20 శాతం ఓట్లు బీజేపీకి పడతాయట. ముదిరాజ్ ఓట్లలో బీజేపీకి 80 శాతం, టీఆర్ఎస్ కు 15 శాతం, కాంగ్రెస్ కు 5 శాతం ఓట్లొస్తాయట. మున్నూరుకాపుల్లో బీజేపీకి 80 శాతం, టీఆర్ఎస్ కు 15 శాతం, కాంగ్రెస్ కు 5 శాతం వస్తాయట. యాదవ సామాజికవర్గంలో టీఆర్ఎస్ కు 50 శాతం, బీజేపీకి 45 శాతం, కాంగ్రెస్ కు 5 శాతం ఓట్లొస్తాయని అంచనా.

ఇక వెలమ ఓట్లలో కూడా టీఆర్ఎస్ కు 50 శాతం, బీజేపీకి 45 శాతం, కాంగ్రెస్ కు 5 శాతం ఓట్లొస్తాయని అనుకుంటున్నారు. పద్మశాలి ఓట్లలో బీజేపీకి 65 శాతం ఓట్లు, టీఆర్ఎస్ కు 30 శాతం, కాంగ్రెస్ కు 5 శాతం ఓట్లు పడతాయట. గౌడ ఓట్లలో బీజేపీకి 70 శాతం, బీజేపీకి 20 శాతం, కాంగ్రెస్ కు 10 శాతం ఓట్లొస్తాయట. ఇతర బీసీ కులాల్లో బీజేపీకి 60 శాతం, బీజేపీకి 30 శాతం, కాంగ్రెస్ కు 10 శాతం ఓట్లొస్తాయని సర్వేలో తేలింది. అలాగే వైశ్య, బ్రాహ్మణ సామాజికవర్గాల్లో బీజేపీకి 78 శాతం, టీఆర్ఎస్ కు 20 శాతం కాంగ్రెస్ కు 2 శాతం ఓట్లొస్తాయని తేలింది.

ఏ మండలంలో తీసుకున్నా, హుజూరాబాద్ మున్సిపాలిటిలో తీసుకున్న బీజేపీకే అత్యధిక ఓటర్లు మద్దతుగా నిలవనున్నట్లు సర్వేలో బయటపడిందట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈటలపై జనాల్లో బాగా సానుభూతి ఉన్నట్లు తెలుస్తోంది. కారణం ఏమిటంటే ఈటలను మంత్రివర్గం నుంచి కేసీయార్ అవమానకరంగా గెంటేసిన తీరును మెజారిటీ జనాలు తప్పుపడుతున్నారట. మంత్రివర్గం నుంచి ఈటలను తొలగించదలచుకున్న కేసీయార్ రాజీనామా తీసుకోకుండా బర్తరఫ్ చేసి అవమానించటంతోనే ఈటలకు సానుభూతి పెరిగిందట. మరి ఈ సర్వే ఎంతవరకు నిజమవుతుందో చూడాల్సిందే.