పార్టీ పెట్టి ఎనిమిదేళ్లు.. ఇంకా పార్ట్ టైం పాలిటిక్సేనా?

దేనికైనా ఒక కాల‌నిర్ణ‌యం ఉంటుంది. నేడు తాజాగా ఉన్న‌ది రేప‌టికి పాత‌ద‌వుతుంది. ఇప్పుడు ఇదే వ్యాఖ్య‌లు.. జ‌న‌సేన గురించి జోరుగా వినిపిస్తున్నాయి. ఈ పార్టీని కొత్త‌ది అనుకోవాలా? పాత‌ది అనుకోవాలా? అనేది చ‌ర్చ‌. ఎందుకంటే..పార్టీ పెట్టి 8 సంవ‌త్స‌రాలు అయింది. ఇప్ప‌టికీ పార్టీకి బూత్ స్తాయిలో కార్య‌క‌ర్త‌లు లేరు. క‌మిటీలూ లేవు.. ఇటీవ‌ల‌.. హైద‌రాబాద్లో జిల్లా పార్టీ అధ్యక్షుల స‌మావేశం నిర్వ‌హిస్తే.. అంతా పేల‌వంగా క‌నిపించింది. దీంతో ఫొటోల‌నుకూడా మీడియాకు విడుద‌ల చేయ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రోవైపు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో అధికారంలోకి వ‌స్తామ‌ని చెబుతున్నారు. నిజానికి ఒక పార్టీకి 8 ఏళ్లు అంటే త‌క్కువ స‌మ‌యం కాదు.

జ‌గ‌న్ పార్టీని తీసుకుంటే.. అతిత‌క్కువ స‌మ‌యంలోనే 67 మంది ఎమ్మెల్యేల‌తో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా మారింది. త‌ర్వాత‌.. ఏకంగా 151 మంది ఎమ్మెల్యేల‌తో అదికారంలోకి వ‌చ్చేసింది. మ‌రి ఎంతో ఇమేజ్‌.. భారీ ఎత్తున అభిమానులు ఉన్న మెగా కుటుంబానికి చెందిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇది సాధ్యం కాదా? అనేది ప్ర‌శ్న. ఇప్ప‌టికి ఎనిమిదేళ్లు గ‌డిచిపోయాయి. ఇప్పుడు పార్టీ అజెండా ఏమిటి? పార్టీ విధానాలు ఎలా తీసుకువెళ్లాల‌నే విష‌యంపై ఇప్ప‌టికీ క్లారిటీ లేద‌నే వాద‌న ఉంది. మ‌రోవైపు.. క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. వీర మ‌హిళ అన్నారు. యువ నేత‌ల‌ను యువ సేన పేరుతో క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. కానీ, ఎక్క‌డ పుంజుకుంటున్నాయ‌నే విష‌యంపై మాత్రం ఎవ‌రూ మాట్లాడ‌రు. మ‌రి ఇదే విధానం కొన‌సాగితే.. జ‌న‌సేన ప‌రిస్థితి ఏంటి? అనేది ప్ర‌శ్న‌.

జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌స్తుందా? రాదా? అనేది ప‌క్క‌న పెడితే.. పార్టీకంటూ.. ఒక విధానం ఉండాలి క‌దా? అన్న చ‌ర్చ ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క జిల్లాలో అయినా.. ఇది మా జిల్లా.. ఇక్క‌డ మాగెలుపును ఎవ‌రూ ఆప‌లేరు.. అని చెప్పుకొనే స్థాయిలో జ‌న‌సేన‌లేద‌నేది వాద‌న‌. యువ‌త భారీగా ఉన్నారు.కానీ, న‌డిపించే నేత‌లే లేక‌పోవ‌డం పార్టీకి ప్ర‌ధానంగా ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అంతేకాదు.. అస‌లు.. పార్టీకి ఎవ‌రో ఒక‌రు తోడు ఉండాలా? జ‌గ‌న్ మాదిరిగా ఒంట‌రిగా ప్ర‌యాణం చేయ‌లేరా? అనేది మ‌రో వాద‌న‌.మ‌రీ ముఖ్యంగా ప‌వ‌న్ ప‌లుమార్లు చెప్పే క‌సి పార్టీలో క‌నిపించ‌డం లేదు. ఓట‌మి నుంచి పార్టీ నేర్చుకున్న పాఠాలు కూడా క‌నిపించ‌డం లేదు.

నిజానికి ఒక ఓట‌మి ఏ పార్టీలో అయినా.. క‌సిని పెంచుతుంది. దీనికి ప్ర‌బ‌ల ఉదాహ‌ర‌ణ వైసీపీనే. 2014లో ఓట‌మి త‌ర్వాత‌.. జ‌గ‌న్ నేరుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. ప్ర‌జ‌ల్లోనే ఉన్నారు. మ‌రి ఈత‌ర‌హా ప‌రిస్థితి జ‌న‌సేన‌లో క‌నిపించ‌డం లేదు. ఎన్నిక‌ల‌కు ఆరు మాసాల ముందు ప్ర‌జ‌ల్లోకి వ‌స్తే.. న‌మ్ముతారా? అప్పుడు ఎన్ని డైలాగులు చెప్పినా.. ఫ‌లితం ఉంటుందా? అనేది ప్ర‌శ్న‌. అయితే.. దీనికి స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితిలో జ‌న‌సేన నేత‌లు ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికైనా.. జ‌న‌సేన నేత‌లు.. వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగితే త‌ప్ప ఆశించిన ఫ‌లితం ఉండ‌ద‌ని మేధావులు సైతం చెబుతున్నారు. ఒకప్పుడు ఎన్నో ఆశ‌ల‌తో పార్టీలో చేరిన వారు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. సో.. మ‌రి జ‌న‌సేన ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందో చూడాలి.