అడ్రస్సే లేని పవన్

మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంతవరకు అడుగే పెట్టలేదు. ఎక్కడ అడుగు పెట్టలేదంటే బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో ప్రచారానికి. వైసీపీ సిట్టింగ్ ఎంఎల్ఏ వెంకటసుబ్బయ్య మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. చనిపోయింది వైసీపీ ఎంఎల్ఏ కాబట్టి, ఆయన భార్య సుధనే పోటీ చేస్తున్నారు కాబట్టి సంప్రదాయం ప్రకారం తాము పోటీ చేసేది లేదని పవన్ ప్రకటించారు. అంతవరకు బాగానే ఉన్నా మరి మిత్రపక్షం బీజేపీ పోటీ మాటేమిటి ? అన్నదే అర్ధంకావటంలేదు. సంప్రదాయానికి తాము వ్యతిరేకం కాబట్టి తమ పార్టీ తరపున సురేష్ ను పోటీలోకి దింపుతున్నట్లు బీజేపీ ప్రకటించింది.

చెప్పినట్లుగానే సురేష్ ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ నేతలు కూడా ఏదోరకంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ వరకు బాగానే ఉందికానీ మరి పవన్ వ్యవహారమే తేలలేదు. పోటీలో ఉన్నది తమ మిత్రపక్షం కాబట్టి పవన్ ప్రచారం చేస్తారంటు జనసేన నేతలు కూడా బహిరంగంగానే ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్ధి తరపున పవన్ ప్రచారం చేస్తారని కమలనాదులు కూడా చెప్పారు. అయితే ఇన్ని రోజులు అయినా పవన్ ప్రచారంలోకి ఎందుకు దిగలేదు ?

నిజానికి బీజేపీ నేతల ప్రచారాన్ని స్ధానికంగా ఉండే జనాలెవరూ పెద్దగా పట్టంచుకోవటంలేదు. సంస్ధాగతంగా బీజేపీకి అసలు బలమే లేదుకాబట్టి అభ్యర్ధిని కూడా ఎవరు పట్టంచుకోవటంలేదన్నది వాస్తవం. మరిలాంటి పరిస్ధితుల్లో మిత్రపక్షాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత జనసేన మీదుంది. ఎందుకంటే బద్వేలులో బలిజలు (కాపు) చాలా ఎక్కువమంది ఉన్నారు కాబట్టి తాము కచ్చితంగా పోటీచేయాల్సిందే అని మొదట్లో జనసేన నేతలు బలంగా వాదించారు.

తమ సామాజికవర్గం ఓట్లే అధికంగా ఉన్న నియోజకవర్గంలో పవన్ ఎందుకని ఇంతవరకు ప్రచారం విషయంలో అడుగుపెట్టలేదో ఎవరికీ అర్ధం కావటంలేదు. ప్రచారానికి వస్తానని కానీ రానని కానీ పవన్ ఇంతవరకు ప్రకటించలేదు. పవన్ ప్రచారానికి వస్తారని జనసేన+బీజేపీ నేతలే అధికారికంగా ప్రకటించారు కాబట్టి పవన్ వస్తారనే అందరు ఎదురుచూస్తున్నారు. పోలింగ్ 30 వ తేదీన జరగబోతోందంటే 28వ తేదీ సాయంత్రానికి ప్రచారం ముగుస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ లెక్కన చూసుకుంటే ఇక మిగిలింది నాలుగురోజులు మాత్రమే.

ప్రచారం విషయాన్ని పక్కనపెట్టేస్తే కనీసం పోలింగ్ ఏజెంట్లను కూడా పెట్టుకోలేని స్ధితిలో ఉంది బీజేపీ. ఈ విషయంలో సహకారం కోరుతు బీజేపీ నేతలు ఇంతవరకు జనసేన నేతలతో సమావేశం పెట్టలేదని సమాచారం. పైగా ఎలాంటి సంబంధంలేని టీడీపీ నేతలను కలిసి తమకు పోలింగ్ ఏజెంట్లుగా ఉండాలని బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి అండ్ కో బతిమలాడుకుంటున్నారు. మిత్రపక్షం జనసేన నేతలు, కార్యకర్తలు ఉండగా పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ నేతలతో మాట్లాడాల్సిన అవసరం బీజేపీ నేతలకు ఏమొచ్చింది ? ఏమిటో మిత్రపక్షాల మధ్య వ్యవహారమంతా గందరగోళంగా ఉంది. చివరకు ఏమవుతుందో ఏమో.