ప్రియాంక ఫార్ములా సక్సెస్ అవుతుందా ?

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా జనాల మద్దతు పొందేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది మొదట్లో జరగబోయే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం సీట్లను మహిళలకే కేటాయించబోతున్నట్లు ప్రియాంక ప్రకటించారు. ఇపుడు చేసిన ప్రకటనను కనుక ప్రియాంక ఆచరణలో చూపించినట్లయితే సత్ఫలితాలు ఉంటాయనే అనుకోవాలి. ఎందుకంటే మొత్తం సీట్లలో 40 శాతం ఆడ వాళ్ళకు కేటాయించటమంటే మామూలు విషయం కాదు.

మామూలుగా జరిగేదేమంటే పార్టీలోని నేతల్లో మహిళా నేతలు చాలా బలంగా ఉన్న చోట్ల మాత్రమే టికెట్లు దక్కించుకుంటున్నారు. లేనిచోట్ల మొత్తం మగవాళ్ళదే ఆధిపత్యంగా అందరికీ తెలిసిందే. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నట్లు మహిళలకు ప్రత్యేకించి రిజర్వేషన్లు లేవు. బలమైన నేతలకు వారసులుగా ఎక్కడైనా భార్య, కూతురు లేకపోతే కోడలు రాజకీయాల్లోకి వస్తే నిలదొక్కుకోవటమే తప్ప డైరెక్టుగా రాజకీయాల్లోకి వచ్చి నిలదొక్కుకున్న మహిళల సంఖ్య తక్కువనే చెప్పాలి.

ప్రతి పార్టీలోను మహిళా విభాగాలుంటాయి కానీ అసెంబ్లీ లేదా పార్లమెంట్ స్థానాల్లో మహిళలకు టికెట్లిచ్చి ప్రోత్సహించిన అధినేతలు చాలా తక్కువే. కానీ ఇపుడు ప్రియాంక చేసిన ప్రకటన ప్రకారమైతే యూపీలోని 403 సీట్లలో 40 శాతం మహిళలకే కేటాయించబోతున్నట్లు లెక్క. 40 శాతం సీట్లంటే సుమారు 150కి పైగా సీట్లనుకోవాలి. మరిన్ని సీట్లను మహిళలకు కేటాయించటమంటే మామూలు విషయం కాదు. కేటాయించాలని అనుకోవటం మంచిదే కానీ అన్ని సీట్లలో గట్టి మహిళా నేతలు దొరకాలి కదా.

పోటీ చేయించాలంటే చాలామంది మహిళలే దొరుకుతారు. కానీ పోటీ చేసిన వారిలో ప్రత్యర్థి పార్టీల అభ్యర్ధులకు ధీటైన పోటీ ఇవ్వగలిగిన వారిని నిలబెట్టడమంటేనే చాలా కష్టం. అందుకనే చాలా నియోజకవర్గాల్లో గట్టి మహిళా నేతలు దొరకరు. పార్టీలు ఎక్కువగా మహిళా నేతలకు టికెట్లు ఇవ్వకపోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమనే అనుకోవాలి. మరి ఇవన్నీ ఆలోచించకుండానే ప్రియాంక 40 శాతం టికెట్లు మహిళలకనే ప్రకటన చేసుంటారా ? అనే డౌట్ వస్తోంది.

అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేమిటంటే ఎలాగూ యూపీలో కాంగ్రెస్ పార్టీ అవసాన దశలో ఉంది. ప్రతి ఎన్నికలోను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారంటే చేస్తున్నారన్నట్లుగానే ఉంది పరిస్ధితి. పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచింది 7 మందంటే 7 మంది మాత్రమే. మగాళ్ళకు టికెట్లిచ్చినపుడే ఏమీ ఉపయోగం కనబడలేదు.

కాబట్టి మహిళలకు టికెట్లివ్వటంలో కొత్తగా జరిగే నష్టం ఏమీ లేదని ప్రియాంక అనుకున్నట్లున్నారు. అందుకనే వ్యూహాత్మకంగా 40 శాతం టికెట్లు మహిళలకంటు ప్రకటించారు. ఒకవేళ సెంటిమెంటుతో మహిళల ఓట్లు కనుక కాంగ్రెస్ అభ్యర్ధులకు పడి గెలిస్తే ప్రియాంక ఫార్ములా సక్సెస్ అయినట్లే.