తమిళనాడు రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో డీఎంకే చేతిలో ఓటమిపాలై నిరాశలో కూరుకుపోయిన అన్నాడీఎంకే శ్రేణుల్లో తిరిగి ఉత్సాహం రానుందా? దివంగత ముఖ్యమంత్రి జయలలిత హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆ పార్టీకి తిరిగి పునర్వైభవం తీసుకువచ్చేందుకు ఆమె నెచ్చెలి మళ్లీ పార్టీలోకి రానుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని గతంలో ప్రకటించిన జయలలిత నెచ్చెలి శశికళ మనసు మార్చుకున్నారు. అన్నాడీఎంకే పార్టీని తిరిగి బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు అన్నీ తానై వ్యవహరించిన శశికళ.. ఆమె మరణం తర్వాత అన్నాడీఎంకేలో చక్రం తిప్పుతారనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ పళని స్వామి పన్నీర్ సెల్వం ఆధిపత్య పోరాటంలో ఆమెకు అవకాశం దక్కలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అక్రమ ఆర్జన కేసులో జైలుకు వెళ్లి వచ్చిన శశికళ పార్టీ కార్యాకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారని అంతా అనుకున్నారు. కానీ ఆమె అనూహ్యంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆమె రాజకీయ జీవితం ముగిసిందనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారు.
పార్టీలోకి మళ్లీ వస్తున్నట్లు క్యాడర్ను ఉద్దేశంచి శశికళనే స్వయంగా ఓ ప్రకటన విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే అందరిదీ అని పార్టీలో అందరూ సమానమేనని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పార్టీకి నేతృత్వం వహించేవాళ్లు తల్లితో సమానమని పార్టీ శ్రేణులను బిడ్డల్లాగా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీంతో పార్టీలో ఆధిపత్య పోరు సాగిస్తున్న పళని స్వామి పన్నీర్ సెల్వంలను ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల పన్నీర్ సెల్వం పళని స్వామితో సమావేశంలో శశికళను అన్నాడీఎంకేలోకి తీసుకొచ్చి కీలక బాధ్యతలు అప్పజెప్పాలని బీజేపీ అగ్రనేత అమిత్ షా సూచించినట్లు సమాచారం. కానీ ఆమె వస్తే తమ ప్రాధాన్యం తగ్గుతుందని భావించిన వీళ్లిద్దరూ శశికళ రాకను ఒప్పుకోవడం లేదని తెలిసింది.
శశికళ మాత్రం ఎట్టి పరిస్థితులు ఎదురైనా అన్నాడీఎంకేను చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. స్టాలిన్ లాంటి బలమైన నాయకుణ్ని ఢీ కొట్టే నేత అన్నాడీఎంకేలో లేకపోతే ఆ పార్టీ మనుగడ కష్టమనే విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు పళని స్వామి పన్నీరు సెల్వం వల్ల పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీకి తాను తప్ప మరో పెద్ద దిక్కు లేదనే భావనతో శశికళ తెరముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తోంది. అన్నాడీఎంకేతో పొత్తులో ఉన్న బీజేపీ.. శశికళ వస్తే ఆమె వర్గానికి చెందిన అయిదు శాతం ఓటు బ్యాంకు కలిసి వస్తుందని భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని అనుకుంటున్న బీజేపీ.. పళని స్వామి పన్నీరు సెల్వంకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తోంది. ఒకటి రెండు నెలల్లో పార్టీ శశికళ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
This post was last modified on October 11, 2021 1:59 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…