బీజేపీ.. తెగేదాకా లాగుతోందా?

Somu Veeraju

ఏపీలోని బ‌ద్వేలు ఉప ఎన్నిక‌తో బీజేపీ జ‌న‌సేన బంధానికి తెర‌ప‌డ‌నుందా? ప‌వ‌న్‌తో పొత్తు విష‌యంలో బీజేపీ తెగేదాకా లాగుతోందా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్నిక ఏక‌గ్రీవం కావాల‌నే ఉద్దేశంతో రాజ‌కీయ విలువ‌ల‌ను పాటించి బ‌ద్వేలులో పోటీకి దూరంగా ఉంటున్న‌ట్లు జ‌న‌సేన ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ బీజేపీ ఈ ఎన్నిక‌లో అభ్య‌ర్థిని నిల‌బెడుతుంద‌ని ప‌వ‌న్ ప్ర‌చారం చేస్తార‌ని ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు తాజాగా వెల్ల‌డించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పోటీనే వ‌ద్దు అనుకుని దూరంగా ఉన్న ప‌వ‌న్‌.. బీజేపీ త‌ర‌పున ఎలా ప్ర‌చారం చేస్తార‌నే ప్ర‌శ్న‌లు రేకెత్తుతున్నాయి.

అధికార వైసీపీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ వెంక‌ట సుబ్బ‌య్య మ‌ర‌ణించ‌డంతో బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఆ స్థానంలో దివంగ‌త ఎమ్మెల్యే భార్య సుధాను వైసీపీ త‌మ అభ్య‌ర్థిగా ఎంపిక చేసింది. ఈ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల కావ‌డం ఈ నెల 30నే పోలింగ్ ఉండ‌డంతో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ ఈ ఉప‌ ఎన్నిక‌లో పోటీ చేయాల‌నే ఒత్తిడి ఉన్న‌ప్ప‌టికీ రాజ‌కీయ విలువ‌ల కోసం త‌ప్పుకుంటున్నామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. చ‌నిపోయిన వ్య‌క్తి స‌తీమ‌ణికి గౌర‌వ‌మిస్తూ పోటీకి దూరంగా ఉంటున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేయాల‌ని కూడా కోరారు. టీడీపీ కూడా ఇదే బాట‌లో సాగింది. చ‌నిపోయిన వ్య‌క్తికి గౌర‌వం ఇచ్చి ఆయ‌న కుటుంబ స‌భ్యులపై పోటీకి నిల‌బ‌డ‌కూడ‌ద‌నే సంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తూ ఈ ఉప ఎన్నిక బ‌రి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు బాబు ప్ర‌క‌టించారు.

కానీ జ‌న‌సేన మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ మాత్రం బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో పోటీ చేసేందుకు సిద్ధ‌మైంది. పొత్తు పెట్టుకున్న ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌కు వ్య‌తిరేకంగా ఉప ఎన్నిక‌లో త‌మ అభ్య‌ర్థిని నిల‌బెడ‌తామ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పైగా త‌మ అభ్య‌ర్థి కోసం ప్ర‌చారానికి ప‌వ‌న్ను కూడా ఆహ్వానిస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. ఎందుకంటే ఈ ఉప ఎన్నిక‌లో పోటీ చేయొద్ద‌నే ప‌వ‌న్ నిర్ణ‌యించారు. అలాంటిది ఇప్పుడు బీజేపీ అభ్య‌ర్థి త‌ర‌పున ప్ర‌చారానికి ఆయ‌న ఎందుకు వ‌స్తారు? అనే ప్ర‌శ్న‌లు రావ‌డం స‌హ‌జ‌మే. అయితే సోము వీర్రాజు ఇలా ప్ర‌క‌టించ‌డం ఏదో ప్ర‌ణాళిక ఉండే ఉంటుంద‌ని జ‌నాలు అనుకుంటున్నారు.

కొంత‌కాలంగా బీజేపీతో ప‌వ‌న్ దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీతో బంధం తెంచుకునే దిశ‌గా జ‌న‌సేనాని సాగుతున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఆయ‌న అడుగులు కూడా అలాగే ప‌డుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా కేంద్రం నిర్ణ‌యంపై పోరాడాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్నారు. దీంతో బీజేపీతో ఆయ‌న పొత్తు తెంచుకుంటార‌నే ఊహాగానాలు బ‌ల‌ప‌డ్డాయి. అంతే కాకుండా ఇటీవ‌ల జ‌న‌సేన సొంతంగానే కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. బ‌ద్వేలు ఉప ఎన్నిక నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప‌వ‌న్ ఒంట‌రిగానే ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు బీజేపీ నిర్ణ‌యం జ‌న‌సేనకు ఇబ్బందిగా మారుతుందా? లేదా పొత్తు తెంచుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుందా? అనే విష‌యం తేలాల్సి ఉంది. ఒక‌వేళ బీజేపీ త‌మ అభ్య‌ర్థిని నిల‌బెడితే.. ఆ ప్రచారానికి ప‌వ‌న్ రాక‌పోతే ఇక ఈ రెండు పార్టీల మ‌ధ్య బంధం ముగిసింద‌నే అర్థం చేసుకోవాలని రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్తున్నారు.