వైకాపా ట్రాప్ లో నాగబాబు?

నిన్నటికి నిన్న మెగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాగబాబు ఉన్నట్లండి రెచ్చిపోయి, తెలుగుదేశం పార్టీ మీద ట్వీట్ల వర్షం కురిపించారు. ఉరుము ఉరిమి దేనిమీదో పడినట్లు బాలయ్య ఏదో ఆవేశంలో మెగాస్టార్ మీద ఓ మాట విసిరారు. దానికి నాగబాబు అంతకన్నా ఘాటుగా సమాధానం ఇచ్చారు. సారీ చెప్పాలని డిమాండ్ చేసారు. అక్కడితో అయిపోయింది. సారీ చెప్పలేదు అలా అని మళ్లీ గట్టిగా కౌంటర్ కూడా ఇవ్వలేదు.

పైగా నాగబాబు లైన్ క్రాస్ చేసి, అమరావతి, భూములు, రియల్ ఎస్టేట్ అంటూ వేరే యాంగిల్ టచ్ చేసినా, తెలుగుదేశం పార్టీ కూడా కాపు సామాజిక వర్గంతో వున్న రాజకీయ అవసరాలను దృష్టిలో వుంచుకుని మౌనంగానే వుండిపొయింది. సరే, ఏదో అభిమానం వున్న చోటా మోటో జనాలు కరోనా టైమ్ లో ఖాళీగా వుండి విడియోలు వదిలారు.

ఇలాంటి పరిస్థితుల్లో నాగబాబు ఇంత బలంగా తెలుగుదేశం పార్టీని ట్వీట్లతో ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? అసలు ఎప్పటికీ అధికారంలోకి రాదు, అసలు ఆ పార్టీ ఆంధ్రకు చేసింది ఏమీ లేదు అని ఎందుకు అనాల్సి వచ్చింది? ఇదంతా ఆవేశమేనా? లేదా దీని వెనుక ఏమైనా వుందా? ఏదైనా జరుగుతోందా? ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి అటు కేసిఆర్ కు ఇటు జగన్ కు సన్నితంగా వున్నారు. వారిద్దరు ఈయనకు గౌరవం ఇస్తున్నారు. అపాయింట్ మెంట్ అడగ్గానే ఇస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ వైఖరి వేరు. ఆయన ఎప్పుడు ఎలా వుంటారో ఆయనకే తెలియాలి. ఆయన అయితే భాజపాతోనే కొనసాగాలని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం అనుకూల స్టాండ్ ఎంత వరకు వుంటుందో, అది ఏ మేరకు వర్కవుట్ అవుతుందో తెలియదు.

ఇలాంటి నేపథ్యంలో నాగబాబును వైకాపా మెల్లగా తన ఫోల్డ్ లోకి తీసుకుందా? అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ రకమైన కామెంట్లు, పోస్ట్ లు కనిపిస్తున్నాయి. సరిగ్గా జగన్ సిఎమ్ అయిన ఏడాది సమయంలో తెలుగుదేశం, దాని మద్దుతు మీడియా విపరీతంగా విమర్శలు కురిపించడం, అదే సమయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వ్యవహారం.

కోర్డు ల నుంచి నోటీసులు ఇలా ఉక్కిరిబిక్కిరి అవుతోంది వైకాపా. ఇలాంటి టైమ్ లో టోటల్ ఇస్యూ డైవర్ట్ అయ్యేలా, అదే విధంగా కాపు సామాజిక వర్గం విషయంలో తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడేలా నాగబాబు చేయగలిగారు?

ఇదంతా కేవలం ఆవేశంతోనే చేసారా? లేక దీని వెనుక ఏదైనా ఆలోచన వుందా? ఇంట్లో అందరూ ఓపార్టీలోనే వుండాలని లేదు. అందువల్ల నాగబాబు మదిలో భవిష్యత్ ఆలోచనలు ఏమైనా వున్నాయా? అన్న గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.