ముప్పేట దాడి.. బాబు ఫీల్ కాలేదా… ఈ మౌన‌మేంటి..?

నిజ‌మే! ఎప్పుడూ.. మీడియాతో స‌మ‌యం గ‌డిపే టీడీపీ అధినేత‌.. మైకు పుచ్చుకుంటే.. గంట‌ల త‌ర‌బ‌డి.. మాట్లాడే మాజీ ముఖ్య‌మంత్రి, .. చంద్ర‌బాబు.. త‌న ఇంటిపై భారీ ఎత్తున దాడి జ‌రిగిన త‌ర్వాత‌ ప‌న్నెత్తి ఒక్క‌మాటంటే.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. క‌నీసం ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయ‌లేదు. పూర్తిగా మౌనం వ‌హించారు. ఇదే.. ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయింది. పోనీ.. ఆయ‌నేమ‌న్నా.. పొరుగు రాష్ట్రంలో ఉన్నారా? అంటే.. కానేకాదు.. ఇక్క‌డే ఏపీలోనే గుంటూరులోని ఉండ‌వ‌ల్లి త‌న నివాసంలోనే ఉన్నారు.

మ‌రి ఇంత జ‌రిగినా.. త‌న ఇంటిపైకి వైసీపీ నాయ‌కులు దాడి చేశార‌ని తెలిసినా.. ఎందుకు మౌనంగా ఉన్నారు? దీనికి కార‌ణ‌మేంటి? ఇదే ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా ఉంది. నిజానికి త‌న పార్టీ వారిపై ఈగ‌వాలినా.. ఇటీవ‌ల కాలంలో.. చంద్ర‌బాబు బాగానే రియాక్ట్ అవుతున్నారు. వెంట‌నే స్పందిస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌పైనా.. డీజీపీ.. పోలీసుల‌పైనా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా ? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి ఏకంగా.. త‌న ఇంటిపైనే దాడి జ‌రిగినా.. ఎందుకు మౌనం వ‌హిస్తున్నారు ? ఈ ప్ర‌శ్న‌ల‌కు రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఒక‌టి.. ప్ర‌స్తుతం టీడీపీ మాజీ మంత్రి.. అయ్య‌న్న పాత్రుడు చేసిన వ్యాఖ్య‌లు చర్చలో ఉన్న నేపథ్యంలో తన రియాక్షన్ ఆ వ్యాఖ్యలను హైలెట్ చేసినట్లు ఉంటుందని ఒక కారణం అయితే, తాను మౌనంగా ఉండి క్షేత్ర‌స్థాయిలో సీనియ‌ర్ నాయ‌కుల‌ను రంగంలోకి దింపడమే మంచిదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగ‌ల కార్యం త‌మ్ముళ్లే చేస్తార‌ని.. చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు సమాచారం.

అంతేగాకుండా.. త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. సో.. అప్పుడు ఈ విష‌యంపై తేల్చుకునేందుకు చంద్ర‌బాబు స‌మాయత్తం అవుతున్నార‌నేది మ‌రో విశ్లేష‌ణ‌. స‌భావేదిక‌గానే త‌న ఇంటిపైకి దూసుకు వ‌చ్చిన ఎమ్మెల్యే జోగిపై చ‌ర్య‌లు తీసుకునేలా ఒత్తిడి పెంచ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించ‌వ‌చ్చని బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. సరైన సమయంలో సరైన స్పందన ఇద్దామని బాబు అనుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఈ కార‌ణాల‌తోనే ఆయ‌న అనూహ్య‌మైన మౌనాన్నిపాటిస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.