ఆఫ్ఘాన్ ప‌రిస్థితి రివ‌ర్స్‌: ప్ర‌జ‌ల‌కు భ‌య‌ప‌డుతున్న తాలిబాన్లు

Afghanistan

ఆఫ్ఘ‌నిస్థాన్ ప‌రిస్థితి రివ‌ర్స్ అయిందా? ఇప్ప‌టి వ‌ర‌కు తాలిబాన్ల‌కు భ‌య‌ప‌డుతున్న ప్ర‌జ‌లు ఎదురు తిరిగేందుకు సిద్ధ‌మ‌య్యారా? ఎవ‌రు త‌మ‌ను నిర్బంధించినా.. ఖ‌చ్చితంగా ఎదుర్కొనేందుకు ప్ర‌జ‌లు రెడీగా ఉన్నారా? అంటే ఔన‌నే అంటున్నారు అంత‌ర్జాతీయ విశ్లేష‌కులు. ఈ క్ర‌మంలో తాలిబాన్లు ఇప్పుడు.. మ‌రో వ్యూహాన్ని ప్లే చేస్తున్నారు. అక్క‌డి ప్రజలకు తాలిబన్లు డెడ్లైన్ విధించారు. సంక్షోభ సమయంలో చేజిక్కించుకున్న ప్రభుత్వ ఆస్తులు, ఆయుధాలు, వాహనాలు, మందుగుండు సామగ్రిని వారంలోగా తమకు అప్పగించాలని ఆదేశించారు. లేదంటే చట్టపర చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.

ఆగస్టు 15న అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తాలిబ‌న్ల దెబ్బ‌తో పరారైన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆఫ్గాని స్థాన్మొత్తం తాలిబన్ల అధీనంలోకి వచ్చింది. ప్రావిన్సులను ఒక్కొక్కటిగా ఆక్రమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే రక్షణ, భద్రత కరవైన ప్ర‌జ‌లు ప్రభుత్వ ఆస్తులను లూటీ చేశారు. అదేస‌మ‌యంలో త‌మ ప్రాణ ర‌క్ష‌ణ కోసం ఆయుధాలు, మందుగుండు సామగ్రి సహా ఇతరత్రా ఎత్తుకెళ్లారు. ఇప్పుడు.. ఈ ప‌రిణామ‌మే.. తాలిబ‌న్ల‌కు ప్రాణ‌సంక‌టంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు తాము ఎదిరించ‌డ‌మే త‌ప్ప‌.. త‌మ‌ను ఎదిరించే వారు లేరు. కానీ, ఇప్పుడు ఆఫ్ఘ‌న్ ప్ర‌జ‌ల వ‌ద్ద ప్ర‌భుత్వ ఆయుధాలు ఉండ‌డంతో తాలిబ‌న్లు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు.

”కాబుల్లోని ప్రజలందరి కోసం ఓ ప్రకటన. వాహనాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర ప్రభుత్వ ఆస్తులు కలిగి ఉన్న వారంతా.. సంబంధిత శాఖలు, కార్యాలయాలకు వాటిని అప్పగించాలి. చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవాలంటే.. వారంలోగా పని పూర్తిచేయాలి” అని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. దేశం తాలిబన్ల చేతుల్లోకి వచ్చిన అనంతరం.. ఆఫ్గానిస్థాన్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పేలుళ్లు, తొక్కిసలాటలు, కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో దాదాపు 200 మందికిపైగా మరణించారు.

మానవ హక్కుల ఉల్లంఘనలు కూడా జరిగినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రజలకు క్షమాభిక్ష ప్రసాదించామని తాలిబన్లు ప్రకటించినా.. మహిళల్ని వేధిస్తున్నారని, హజారా వర్గంపై దాడులు చేస్తున్నారని కథనాలు వచ్చాయి. ఆఫ్గాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభంతో.. వచ్చే 4 నెలల్లో 5 లక్షలకుపైగా ఆఫ్గాన్ ప్రజలు దేశం విడిచివెళ్లిపోతారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ అంచనా వేసింది.

ఇదిలావుంటే.. కాబుల్ విమానాశ్రయం సమీపంలో రానున్న 36 గంటల్లో మరోసారి పేలుళ్లు సంభవించే అవకాశముందని అమెరికా హెచ్చరించింది. వీలైనంత త్వరగా విమానాశ్రయం పరిసర ప్రాంతాల నుంచి తరలి వెళ్లాలని తమ పౌరులను కోరింది. విమానాశ్రయానికి రావొద్దని, ఎయిర్పోర్ట్ అన్ని ద్వారాల వద్ద నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. ముఖ్యంగా దక్షిణ ద్వారం, పంజ్షేర్ పెట్రోల్ స్టేషన్ గేట్కు సమీపంలో పేలుళ్లు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందనే సమచారం అందినట్లు పేర్కొంది.