జ‌గ‌న్ నువ్వు వేసింది క‌రెక్ట్ స్టెప్పేనా ?


ఏపీ సీఎం జ‌గ‌న్ తాజాగా తీసుకున్న నిర్ణ‌యంపై విమర్శ‌లు, ప్ర‌తివిమర్శ‌లు వ‌స్తున్నాయి. జ‌గ‌న్ ఇలా ఎందుకు చేయాల్సి వ‌చ్చింద‌నే విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది. విష‌యం ఏంటంటే.. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల‌కు మ‌ధ్య‌.. జ‌ల వివాదాలు న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం.. కృష్ణాన‌ది యాజ‌మాన్య బోర్డును, గోదావ‌రి న‌ది యాజ‌మాన్య బోర్డును ఏర్పాటు చేసింది. ఇదిలావుంటే, కృష్ణా న‌ది జలాల వివాదం ప్ర‌స్తుతం సుప్రీం కోర్టును చేరింది.

అయితే.. ఈ విష‌యంలో ఇరు రాష్ట్రాలు మ‌ధ్య‌వ‌ర్తిత్వం ద్వారా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి పేర్కొన్నారు. కానీ, దీనికి జ‌గ‌న్ స‌ర్కారు నిరాక‌రించింది. అయితే, సుప్రీంకోర్టు చేసిన సూచనకు తెలంగాణ అంగీకారం తెలిపింది. అంటే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం న్యాయ ప‌రంగానే జ‌ల వివాదాన్ని ప‌రిష్క‌రించే ఉద్దేశంతో ఉంది. ఈ నేప‌థ్యంలో వెంట‌నే జ‌గ‌న్ స‌ర్కారుపైనా.. సీఎం ఆలోచ‌న‌ల పైనా పెద్ద ఎత్తున దుమారం రేగింది. జ‌గ‌న్‌కు అహంకారం ఎక్కువ‌ని.. సుప్రీం కోర్టు సూచ‌న‌ల‌ను కూడా ప‌క్క‌న పెట్టార‌ని.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

కానీ, వాస్త‌వం ప‌రిశీలిస్తే.. నీటిపారుద‌ల రంగ నిపుణులు మాత్రం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌రైందేనని అంటున్నారు. ఎందుకంటే.. ఎగువ‌న ఉన్న రాష్ట్రం ఎప్పుడు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుందో చెప్ప‌డం క‌ష్టం. మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌ల విష‌యంలో ఇదే జ‌రిగింది. గ‌తంలో మ‌ధ్య‌వ‌ర్తిత్వం ద్వారా.. అక్క‌డ కూడా జ‌ల వివాదం ప‌రిష్కరించుకున్నారు. అయితే.. త‌ర్వాత‌.. మ‌హారాష్ట్ర దీనిని తోసిపుచ్చింది. ఫ‌లితంగా క‌ర్ణాట‌క‌.. మ‌హారాష్ట్ర‌ల మ‌ధ్య మ‌ళ్లీ వివాదం రేగింది.

ఇప్పుడు ఏపీ-తెలంగాణ విష‌యంలోనూ మ‌ధ్య‌వ‌ర్తిత్వం ప‌నికిరాద‌నేది నిపుణుల మాట‌. న్యాయ‌ప‌రంగా వాటా ల‌భిస్తే.. అది ఎప్ప‌టికైనా శాశ్వ‌త మ‌ని.. మ‌ధ్య‌వ‌ర్తిత్వానికి అవ‌కాశం క‌ల్పిస్తే.. అది రాజ‌కీయంగా ప్ర‌భావం చూపించి.. త‌ర్వాత‌.. వ‌చ్చే ప్ర‌భుత్వాలు దీనిని తోసిపుచ్చితే.. మ‌ళ్లీ ఏపీ రైతుల‌కు, ప్ర‌జ‌ల‌కు కూడా ఇబ్బందులు త‌ప్ప‌వు. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ న్యాయ‌ప‌ర‌మైన ప‌రిష్కారం చూపుతున్నార‌ని.. ఇదే మంచిద‌ని అంటున్నారు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. జ‌గ‌న్ నిర్ణ‌యాల‌ను తీవ్రంగా వ్య‌తిరేకించే టీడీపీ కూడా ఈ విష‌యంలో మౌనంగా ఉండ‌డం..!