వైవీకే టీటీడీ ప‌గ్గాలు.. జ‌గ‌న్ వ్యూహాత్మ‌క నిర్ణ‌యం

YV Subba Reddy

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చైర్మ‌న్‌గా మ‌ళ్లీ వైవీ సుబ్బారెడ్డికే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మొగ్గు చూపారు. పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను జగన్ సర్కార్ ప్రకటించింది. దీంతో జ‌గ‌న్ నిర్ణ‌యంపై ఒక‌వైపు సంతోషం వ్య‌క్త‌మ‌వుతున్నా.. వైవీ వ‌ర్గంలో మాత్రం ఒకింత నిరుత్సాహం క‌నిపిస్తోంది.

నిజానికి టీటీడీ బోర్డు ప‌ద‌వికి ఇటీవ‌ల స‌మ‌యం గ‌డిచిపోవ‌డంతో జ‌గ‌న్‌.. బోర్డు ను ర‌ద్దు చేశారు. దీంతో వైవీ.. అటు రాజ్య‌స‌భ కానీ, ఇటు ఎమ్మెల్సీ అయి.. మంత్రిగా కానీ, చ‌క్రం తిప్పాల‌ని భావించారు. దీంతో వైవీపై సోష‌ల్ మీడియాలోనూ మంత్రి అవుతారంటూ.. ప్ర‌చారం సాగింది.

కానీ, ఇప్ప‌టికే.. చాలా మంది వ‌రుస‌లో ఉన్న నేప‌థ్యంలో వైవీని ప‌క్క‌న పెట్టి.. వ్యూహాత్మ‌కంగా మ‌ళ్లీ టీటీడీ బోర్డు చైర్మ‌న్‌గానే నియ‌మించ‌డం గ‌మ‌నార్హం. దీంతో వ‌చ్చే రెండున్న‌రేళ్ల‌పాటు.. వైవీ చైర్మ‌న్‌గానే ఉండాల్సి ఉంటుంది. ఫ‌లితంగా ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాలు. పాల‌న‌లో ఆయ‌న నేరుగా జోక్యం చేసుకునే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది.

అయితే.. దీనికి పార్టీలోనే ఉన్న వైవీ వ్య‌తిరేక వ‌ర్గం చ‌క్రం తిప్పింద‌ని.. ముఖ్యంగా ఒంగోలు కు చెందిన మంత్రి ఒక‌రు జ‌గ‌న్ ద‌గ్గ‌ర చ‌క్రం తిప్పి.. వైవీని తిరిగి టీటీడీ కి పంపించార‌ని.. వైసీపీలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, వైవీ ప‌రంగా చూసుకుంటే.. ఆయ‌న‌కు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌పై చాలా ఆస‌క్తి ఉంది. గ‌త ఎన్నిక‌ల్లోనే ఒంగోలు ఎంపీ అభ్య‌ర్థిగా పోటీచేయాల‌ని అనుకున్నా(వ‌రుస‌గా రెండోసారి) జ‌గ‌న్ అడ్డు చెప్పి.. వ‌ర్గ పోరుకు ఫుల్ స్టాప్ పెట్టారు.

అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తాను యాక్టివ్ అయి.. మ‌ళ్లీ పార్టీలో చ‌క్రం తిప్పాల‌ని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ప‌రిస్థితిని మాత్రం అనుకూలంగా మార్చుకోలేక పోయారు. ఇప్పుడు టీటీడీ చైర్మ‌న్‌గా వైవీ మ‌రోసారి చ‌క్రం తిప్పే ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌న‌ట్టే అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.