దండ‌యాత్ర‌… ఇది రేవంత్ రెడ్డి దండ‌యాత్ర‌…

తెలంగాణ పీసీసీ ర‌థ‌సార‌థి రేవంత్ రెడ్డి త‌న‌దైన శైలిలో డైన‌మిక్ రాజ‌కీయాలు చేసే సంగ‌తి తెలిసిందే. దూకుడుకు మారుపేరైన రేవంత్ తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ముందు అంత‌ర్గ‌త రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టాల‌ని భావించిన రేవంత్ రెడ్డి ఈ మేర‌కు పార్టీ నేత‌ల‌పై న‌జ‌ర్ పెట్టారు. హుజురాబాద్‌ నియోజకవర్గానికి చెందిన కౌశిక్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీలోని ఇంటి దొంగలను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అంతేకాకుండా ఇంటి దొంగ‌ల‌కు వార్నింగ్ అని చెప్పుకొచ్చారు.

అధికార పార్టీకి కౌశిక్‌ దగ్గరగా ఉంటున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతుండగా తాజాగా లీక్ అయిన ఆడియో టేపులు కలకలం సృష్టించాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందంటూ ఆయనే స్వయంగా చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాకుండా… “యూత్‌ను సమీకరించండి. డబ్బులు ఇద్దాం.. మీకు నేను అండగా ఉంటా”.. అంటూ ఆయన మాట్లాడినట్టు ఉన్న టేపులు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణా సంఘం.. కౌశిక్‌కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. అనంత‌రం పాడి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి కాంగ్రెస్‌ పార్టీ బహిష్కరించింది. అధికార టీఆర్ఎస్‌ పార్టీతో కుమ్మక్కై.. పార్టీకి ద్రోహం చేస్తున్నాడంటూ ప్ర‌క‌టించింది.

ఈ స‌స్పెన్ష‌న్ అనంత‌రం తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీలోని ఇంటి దొంగలకు సీరియస్‌ వార్నింగ్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. “కాంగ్రెస్‌ ఇంటి దొంగలకు నెలాఖరు వరకు డెడ్‌లైన్‌. ఇంటి దొంగలను వదిలిపెట్టేది లేదు. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ కోసం కష్టపడేవాడు ఉంటే వదులుకునేది లేదు. పార్టీ కోసం కష్టపడేవాళ్లను గుండెల్లో చేర్చుకుని, దగ్గర పెట్టుకుని చూసుకునే బాధ్యత మాది. కానీ, ఇంటి దొంగలు ఎవరైనా ఉంటే పరారు అవ్వాలి” అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలోని కొందరు నేతలు అధికార టీఆర్ఎస్‌ పార్టీతో కుమ్మక్కు అయినట్టు అనుమానిస్తున్న రేవంత్ రెడ్డి ఈ మేర‌కు వారిపై దండ‌యాత్ర మొద‌లుపెట్టిన‌ట్లు చెప్తున్నారు.