అచ్చెన్న కానివాడైపోయాడా ?

Atchannaidu Kinjarapu

ఈ అనుమానమే అందరిలోను పెరిగిపోతోంది. మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు జిల్లాలోని టీడీపీ సీనియర్లలోని మెజారిటి నేతలతో గ్యాప్ పెరిగిపోతోందని టాక్ నడుస్తోంది. అధికారంలో ఉన్నపుడు మంత్రి హోదాలో అచ్చెన్న జిల్లాలో ఫుల్లుగా చక్రం తిప్పారు. మిగిలిన ఎంఎల్ఏలతో పాటు చాలామంది సీనియర్లను కూడా పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలకు కొదవేలేదు.

అందుకనే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అచ్చెన్నంటే మంటగా ఉన్న చాలామంది నేతలు దూరంగానే ఉంటున్నారు. విషయం అర్ధమైపోయిన అచ్చెన్న కూడా వాళ్ళను కలుపుకుని పోవటానికి పెద్దగా ప్రయత్నాలు చేయలేదని సమాచారం. ఇందుకనే తాజాగా అచ్చెన్న కుటుంబంలోని కొందరిపై ప్రభుత్వం రౌడీషీటర్ తెరిచినా జిల్లాలోని నేతలు చాలా లైటుగా తీసుకున్నారు.

అచ్చెన్న సోదరుడు హరివరప్రసాద్ తో పాటు మరో సోదరుడి కొడుకు, వరసకు తమ్ముడు లాంటి దగ్గర బంధువులపై ప్రభుత్వం రౌడీషీటర్ ఓపెన్ చేసింది. కింజరాపు కుటుంబాల్లోని వాళ్ళపై నమోదైన కేసులను చూసిన తర్వాతే రౌడీషీటర్ ఓపెన్ చేసింది ప్రభుత్వం. ఇలాంటి కేసుల్లో ఎక్కువకేసులు చాలా సంవత్సరాలుగా కంటిన్యు అవుతున్నవే.

ఒకపుడు టీడీపీ నేతల్లో ఎవరిపైన కేసు పెట్టినా మిగిలిన నేతలు వెంటనే స్పందించేవారు. అలాంటిది రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న కుటుంబసభ్యులపైన రౌడీషీటర్ ఓపెన్ చేస్తే కూడా నేతల్లో చాలామంది తమకేమీ సంబంధం లేదన్నట్లే వ్యవహరించటం ఆశ్చర్యంగా ఉంది. అచ్చెన్న కుటుంబానికి మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కరు కూడా ఎందుకని నోరిప్పలేదో అర్ధం కావటంలేదు. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాల్లో జిల్లాలో అచ్చెన్న మిగిలిన నేతలకు అంత కానీవాడైపోయారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.