కొత్త చిక్కుల్లో ఆర్ఆర్ఆర్..!

నర్సాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణం రాజు సరికొత్త చిక్కుల్లో పడ్డారు. వైసీపీ గుర్తుతో ఎన్నికల్లో పోటీకి దిగి.. ఎంపీగా విజయం సాధించిన ఆయన.. కొద్దిరోజులకే రెబల్ గా మారారు. సీఎం జగన్, ఆ పార్టీ నేతలపై విమర్శలు చేస్తూ.. పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు.

కాగా.. జగన్ కి వ్యతిరేకంగా మారి.. ఆయన కొత్త సమస్యలు తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే.. దేశద్రోహం నేరం కింద సిఐడి కేసులకు సంబంధించి ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈ క్రమంలో రఘురామపై మరో ఫిర్యాదు నమోదయింది. రెడ్డి సామాజిక వర్గాన్ని దూషించారు అంటూ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

ఇటీవల రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరచేలా పలు వ్యాఖ్యలు చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ మానవహక్కుల కమిషన్ కి ఓసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణంరాజు మాట్లాడిన వీడియోలను సైతం ఫిర్యాదుకు జతచేశారు. కరుణాకర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది. దీనిపై త్వరలోనే రఘురామ కి నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.

కాగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచడంతో పాటు ప్రజల మధ్య విబేధాలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని ఇటీవల రఘురామకృష్ణరాజు పై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే విచారణ సందర్భంగా ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. తనను కొట్టారంటూ రఘురామ ఆరోపించడం, సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి సైతం ఇదే రకమైన నివేదిక ఇవ్వడంతో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మరో కేసు రఘురామను చుట్టుముట్టింది.