తెలంగాణ ప్రజలకు నారా భువనేశ్వరి శుభవార్త..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి.. తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలియజేశారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా కనీసం ఆక్సిజన్ లభించక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో.. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. తెలంగాణ రాష్ట్రంలో రెండు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ప్లాంట్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు దాతల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని ఆమె అన్నారు.

కరోనా కష్టకాలంలో కరోనా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కీలక ముందడుగు వేసిందన్నారు భువనేశ్వరి. ఈ సందర్భంగా దాతలందరికి భువనేశ్వరి పేరు పేరునా అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. అనాథ శవాల అంతిమ సంస్కారాలకు ట్రస్ట్ సేవా విభాగం ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. టెలీమెడిసిన్, మందుల పంపిణీ, అన్నదానం కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. 24/7 కాల్ సెంటర్ ద్వారా కరోనా రోగులకు నిరంతర సేవలు అందిస్తున్నట్టు చెప్పారు.