కోవాగ్జిన్ టెక్నాలజీ ఇచ్చేదే లేదు

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టెక్నాలజీని ఇతర కంపెనీలకు బదిలీ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురు డిమాండ్ చేయడం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)ల సహకారంతో భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్ అభివృద్ధి చేయగా.. ఈ వ్యాక్సిన్ టెక్నాలజీని ఇప్పటికే సంస్థ పంచుకుందని, ఏప్రిల్లోనే మూడు ప్రభుత్వ రంగ సంస్థల్లో కోవాగ్జిన్ ఉత్పత్తి మొదలైందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ టెక్నాలజీని వేరే ప్రైవేటు సంస్థలకు కూడా బదిలీ చేయాలంటూ జగన్ లాంటి వాళ్లు డిమాండ్ చేశారు. ఐతే ఆ ప్రసక్తే లేదంటూ భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్లా తాజాగా స్పష్టమైన స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం.

కోవాగ్జిన్ టీకా పూర్తిగా భారత్ బయోటెక్ సొంతమని, ప్రైవేటు సంస్థలకు దీని టెక్నాలజీని బదిలే చేసే అవకాశమే లేదని ఓ ఇంగ్లిష్ పత్రికలో ప్రచురితమైన కథనంలో సుచిత్ర స్పష్టం చేశారు. దీని ప్రకారం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ను సేకరించి కంపెనీకి అందించడంతో పాటు పెద్ద జంతువులు, కోతులు, ఎలుకలపై ప్రయోగ పరీక్షల్లో సహకరించడానికి మాత్రమే ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీలు పరిమితమయ్యాయని.. వ్యాక్సిన్ టెక్నాలజీని రూపొందించడంలో వారి పాత్ర ఏమీ లేదని సుచిత్ర తెలిపారు.

కొన్ని పెద్ద జంతువులపై నేరుగా ప్రయోగ పరీక్షలను నిర్వహించేందుకు ప్రైవేటు ఔషధ సంస్థలకు అనుమతులు లేనందు వల్లే.. ఆ ట్రయల్స్‌ కోసం ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీ సహకారాన్ని తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీల నుంచి కరోనా స్ట్రెయిన్‌ అందిన తర్వాత మొత్తం పనిని చక్కబెట్టింది తామేనన్నారు. పూర్తిస్థాయిలో కంపెనీ నిధులతో, సొంత ల్యాబ్‌ల్లో స్ట్రెయిన్‌ను పరీక్షించడం దగ్గరి నుంచి ప్రయోగాత్మక టీకాను మనుషులపై పరీక్షించే దాకా ప్రతిచోటా భారత్‌ బయోటెక్‌ కష్టమే ఉందని.. కాబట్టి ఇతర ఫార్మా కంపెనీలకు కొవాగ్జిన్‌ పేటెంట్లు, తయారీ పరిజ్ఞానాన్ని బదిలీ చేసే ప్రసక్తి లేదని ఆమె తేల్చిచెప్పారు.