టీకాల్లో ఆలస్యం తప్పదా ?

18 ఏళ్ళు నిండిన వాళ్ళు కరోన వైరస్ టీకాలు వేసుకోవటానికి మరో నెలరోజులు వెయిట్ చేయక తప్పదు. ఎందకంటే వాళ్ళకు అవసరమైన టీకాలు ఇప్పుడిప్పుడే అందేట్లులేదు. ప్రభుత్వం ప్రకటించిన లెక్క ప్రకారమే 18 ఏళ్ళు నిండినవాళ్ళకు టీకాలు వేయాలంటే సుమారు 2 కోట్ల టీకాలు అవసరం. అంటే రెండు డోసులకు కలిపి 4 కోట్లకు పైగా టీకాలు కావాలి.

ఇపుడు 45-60 ఏళ్ళమధ్య వారికి టీకాలు వేయటానికే సరపడా వ్యాక్సిన్ అందుబాటులో ఉండటంలేదు. దీనివల్లే మధ్య వయస్సుల వారికి కూడా టీకాల షెడ్యూల్ తేదీలను ప్రభుత్వమే మార్చేస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే టీకాలను ఉత్పత్తి చేసే రెండు కంపెనీలనుండి సరపడా ఉత్పత్తి కాకపోవటమే. యావత్ దేశానికి 45-60 ఏళ్ళ వయసుల వారికి వ్యాక్సిన్లు వేయాలంటేనే వందల కోట్ల డోసులు ఉత్పత్తిచేయాలి.

ముడిసరుకు కొరత, మ్యాన పవర్ కొరత, సాంకేతిక నిపుణుల కొరత లాంటి అనేక సమస్యల వల్ల ఫార్మా కంపెనీలు కూడా అవసరానికి సరపడా టీకాలను ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. ముందు చెప్పిన వయసుల వాళ్ళకే రెండు డోసులు సక్రమంగా వేయలేకపోతున్న ప్రభుత్వాలు ఇక 18 ఏళ్ళు నిండినవారికి కూడా టీకాలు వేయాలంటే ఎన్ని సమస్యలను ఎదుర్కోవాలో చెప్పక్కర్లేదు.

జనాలందరికీ టీకాలను అందివ్వలేని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే టీకాల విషయంలో తన బాధ్యతల నుండి తప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే ఫార్మాకంపెనీలతో నేరుగా మాట్లాడుకోవాలని రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించి చేతులు దులిపేసుకుంది. ఫార్మాకంపెనీలేమో డిమాండ్ కు తగ్గట్లుగా ఉత్పత్తి చేయలేక అవస్తలు పడుతున్నాయి. ఈ కారణంగానే 18 ఏళ్ళు నిండిన వారికి టీకాలు వేయటం ఆలస్యమవుతోంది. ఈ విషయాన్ని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్ సింఘాలే స్వయంగా చెప్పారు. మే 1 నుండి 18 ఏళ్ళు నిండినవారికి మొదలవ్వాల్సిన టీకాల కార్యక్రమం జూన్ కు వాయిదా వేసినట్లు చెప్పారు. జూన్ లో అయినా మొదలవుతుందా అంటే ఎవరు చెప్పలేకున్నారు.