య‌న‌మ‌ల ఇలాకాలో ఘోర ప‌రాజ‌యం..

టీడీపీలో సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర‌ను సొంతం చేసుకున్న నాయ‌కుడు, చంద్ర‌బాబు త‌ర్వాత‌.. నెంబ‌ర్ 2గా వ్య‌వ‌హ‌రించే నేత‌.. మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు. వ్యూహాలు.. ఎత్తుల‌కు పై ఎత్తులు వేయ‌డంలో ఆయ‌న‌ను మించిన నాయ‌కుడు లేర‌ని ఒక ప్పుడు టాక్‌. అయితే.. ఆయ‌న కొన్నేళ్లుగా వైట్ ఎలిఫెంట్‌గా మారిపోయార‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. తూర్పుగోదావ‌రి జిల్లాలోని తుని నియోజ‌క‌వ‌ర్గం నుంచి అన్న‌గారు ఎన్టీఆర్ హ‌యాంలోనే టీడీపీ లోకి వ‌చ్చిన య‌న‌మ‌ల‌.. స్పీక‌ర్‌గా, మంత్రిగా.. పార్టీలో అనేక ప‌దవులు వ్య‌వ‌హ‌రించారు.

తుని నుంచి ప‌లుమార్లు విజ‌యం సాధించి.. టీడీపీకి ఒక‌ప్పుడు కంచుకోట‌గా మ‌లిచారు. పార్టీ ఆవిర్భావం త‌ర్వాత‌ 1983 ఎన్నిక‌ల నుంచి 2004 వ‌ర‌కు కూడా వ‌రుస విజ‌యాలు సాధించారు. తిరుగేలేని నేత‌గా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. అయితే.. 2009లో మాత్రం త్రిముఖ పోటీ.. వైఎస్ హ‌వాతో య‌న‌మ‌ల తొలిసారి ఓడిపోయారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు చంద్ర‌బాబు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక‌, ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల నాటికి ఆయ‌న త‌ప్పుకొని ఆయ‌న సొద‌రుడుకు ఇక్క‌డ టికెట్ ఇప్పించుకున్నారు. ఇక‌, ఈయ‌న కూడా వ‌రుస ప‌రాజ‌యాలు చ‌విచూశారు. అయిన‌ప్ప‌టికీ.. తునిలో య‌న‌మ‌ల సోద‌రులు హ‌వా చ‌లాయిస్తూనే ఉన్నారు. త‌మ వ్యాపారాలు.. వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్టుకుంటూనే ఉన్నారు.

అయితే.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం టీడీపీని గ‌ట్టెక్కించ‌లేక పోయారు. క‌నీసం.. గౌర‌వ ప్ర‌ద‌మైన స్థానాల‌ను కైవ‌సం చేసుకోవ‌డం మాట అటుంచితే.. పార్టీకి ఉనికి కూడా లేకుండా పోయేలా వ్య‌వ‌హ‌రించార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక్క‌డ తుని మునిసిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క దానిలోనూ టీడీపీ విజ‌యం సాధించ‌లేదు. మొత్తం గుండుగుత్తుగా వైసీపీ త‌న ఖాతాలో వేసుకుని.. సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. టీడీపీ విజ‌యం సాధించ‌లేక‌పోవ‌డానికి య‌న‌మ‌ల సోద‌రులు అనుస‌రించిన వైఖ‌రే కార‌ణ‌మ‌ని టీడీపీలో నేత‌లు బ‌హిరంగ వ్యాఖ్య‌లే చేస్తున్నారు. త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌ని.. వారు అంటున్నారు. అదేస‌మ‌యంలో పార్టీ అధిష్టానం ముందు.. అన్నీ తాను చూసుకుంటున్నాన‌ని చెప్ప‌న య‌న‌మ‌ల త‌ర్వాత చేతులు ఎత్తేశార‌ని.. కూడా ఇక్క‌డి అభ్య‌ర్థులు వాపోతున్నారు. మొత్తంగా చూస్తే.. య‌న‌మ‌ల సోద‌రులు తునిని తునాతున‌క‌లు చేశార‌నే కామెంట్లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.