పాతికేళ్ల అధిక్యానికి తెర.. టీడీపీ కంచుకోట బద్దలు

ఇక్కడ అక్కడ అన్న తేడా లేకుండా.. ఏపీలో ఎక్కడైనా సరే ఫ్యాన్ గాలి వీసిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై అదే పనిగా సాగిన విష ప్రచారాన్ని ప్రజలు నమ్మనట్లుగా కనిపిస్తోంది. తాజాగా వెల్లడైన మున్సిపల్ పోల్స్ లో గతంలో ఎప్పుడూ లేనంతగా టీడీపీ దారుణంగా దెబ్బ తింటే.. అధికార వైసీపీ మాత్రం విజయ దుందుబి మోగించింది. దీంతో.. పలు కొత్త రికార్డులు నమోదైన పరిస్థితి.

తూర్పుగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోటగా చెప్పే మండపేటలో తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాన్ని సాధించింది. మొత్తం 30 వార్డుల్లో 22 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. పాతికేళ్ల టీడీపీ అధిక్యానికి తెర దీస్తూ.. ఆ పార్టీకి చెందిన ఏడుగురు అభ్యర్థులు మాత్రమే గెలవటం గమనార్హం.

టీడీపీ పెట్టిన తర్వాత 1987లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మున్సిపల్ ఛైర్ పర్సన్ గా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కృష్ణార్జునచౌదరి సతీమణి ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీనే విజయాన్ని సొంతం చేసుకుంది. 1995.. 2000.. 2005.. 2014లో టీడీపీనే ఇక్కడ గెలుపొందింది. అందుకుభిన్నంగా ఈసారి మాత్రం ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు 10వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో.. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన గెలుపులో కీలకం మండపేట. అలాంటిది.. తాజాగా జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన ఇక్కడ పార్టీ ఓడిపోవటాన్ని తెలుగు తమ్ముళ్లు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఏపీలోని చాలా చోట్ల చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. కేవలం రెండున్నరేళ్ల వ్యవధిలో ఎంత మార్పు వచ్చిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.