కేసీయార్ ను టార్గెట్ చేసిన షర్మిల

తెలంగాణాలో తొందరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్న షర్మిల డైరెక్టుగా కేసీయార్ నే టార్గెట్ చేశారు. లోటస్ పాండ్ లో మీడియాతో మాట్లాడిన షర్మిల తన స్ధానికతపై జరుగుతున్న ప్రచారానికి గట్టి రిప్లై ఇచ్చారు. తాను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగానని, తెలంగాణా కోడలనని గట్టిగానే బదులిచ్చారు. తన పిల్లలు కూడా ఇక్కడే పుట్టి పెరిగిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంతటితో ఆగితే బాగానే ఉండేది. స్ధానికతపై మాట్లాడుతూ కేసీయార్, బీజేపీ నేత విజయశాంతి స్ధానికతను ఆమె ప్రశ్నించటమే ఆశ్చర్యంగా ఉంది.

కేసీయార్, విజయశాంతి ఎక్కడపుట్టారు ? అన్న షర్మిల ప్రశ్నకు మీడియా నుండి సమాధానమే రాలేదు. అదే ఊపులో కేసీయార్ పరిపాలనపై విమర్శలతో కూడిన ఆరోపణలు సంధించారు. గొర్రెలు, బఱ్ఱెలు ఇస్తే సరిపోతుందా ? ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదు ? అంటూ పరోక్షంగా కేసీయార్ ను నిలదీశారు. కేసీయార్ ఫాం హౌస్ కు మాత్రమే పరిమితమై పరిపాలనను గాలికొదిలేశారని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

కరోనా వైరస్ సమయంలో జనాలంతా అల్లాడిపోతుంటే కేసీయార్ ఏమన్నా పట్టించుకున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు. రోగుల నుండి లక్షల రూపాయలు దోచుకున్న ఆసుపత్రులపైన కనీసం దృష్టి కూడా కేసీయార్ పెట్టలేదంటు ఘాటు వ్యాఖ్యలే చేశారు. తెలంగాణా అభివృద్ధిపై ఎవరికీ చిత్తశుద్ది లేదని తేల్చేశారు. ఒకపార్టీ ఉద్యమం అంటుంటే మరోపార్ట మతం అంటోందంటు ఒకేసారి టీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు చేశారు. ఆరోగ్య శ్రీ పథకం నిర్వీర్యమైపోయిందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

తొందరలోనే తాను తెలంగాణాలో పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రాభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డిని ఎదిరించటానికైనా సిద్ధమన్నారు. తనకు తెలంగాణా ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి పోలవరం నుండి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వరకు పోరాటం చేస్తానన్నారు. తొందరలోనే అమరవీరుల కుటుంబాలను కలుస్తానన్నారు. షర్మిల మీడియా చిట్ చాట్ చూస్తే చాలా జాగ్రత్తగానే పావులు కదుపుతున్నట్లే అనిపిస్తోంది.

అవసరమైతే జగన్ను కూడా ఎదిరిస్తానని, కేసీయార్, విజయశాంతి ఎక్కడ పుట్టారని, తెలంగాణా ప్రయోజనాలే తనకు ముఖ్యమని, అమరవీరులను కలుస్తానని చెప్పటం చూస్తుంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లే ఉంది. దీనికంటే ముందు తెలంగాణాలో పాదయాత్ర చేస్తానని, అమరవీరులను కలుస్తానని చెప్పటం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అమరవీరుల కుటుంబాలను కేసీయార్ దూరంగా పెట్టేశారనే ఆరోపణలున్న విషయం అందరికీ తెలిసిందే. అంటే ఇటు కేసీయార్, అటు బీజేపీలకు సవాలు విసురుతున్నట్లే ఉంది చూస్తుంటే. చూద్దాం నాలుగు రోజుల తర్వాత ఏమవుతుందో ?