ఒత్తిడికి కేంద్రం లొంగిపోయినట్లేనా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఏడాదిన్నర పాటు కొత్త వ్యవసాయచట్టాల అమలును నిలిపేసేందుకు సిద్ధమంటు కేంద్రం తాజాగా చేసిన ప్రతిపాదన తర్వాత రైతుసంఘాల ఒత్తిడి లొంగినట్లే అనిపిస్తోంది. కేంద్రం కొత్తగా రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు రైతుసంఘాలు ఉద్యమం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కార్పొరేట్ సంస్ధల ప్రయోజనాల కోసమే కేంద్రం వ్యవసాయ చట్టాలను చేసిందన్నది రైతుసంఘాల ప్రధాన ఆరోపణ.

రైతుల ఆరోపణలకు సరైన సమాధానం చెప్పుకోలేని కేంద్రం వ్యవసాయ చట్టాల రద్దు మాత్రం కుదరదని తెగేసి చెప్పింది. వ్యూహాత్మకంగా ఇప్పటికి తొమ్మిదిసార్లు చర్యల పేరుతో కాలయాపన చేసింది. కేంద్రం ఎన్ని ఎత్తులు వేసినా రైతుసంఘాలు మాత్రం లొంగలేదు. ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో సింఘూ వద్ద దాదాపు 59 రోజుల క్రితం మొదలుపెట్టిన ఉద్యమం అంతకంతకు పెరుగుతునే ఉంది. జరుగుతున్న వ్యవహారాలను చూసిన తర్వాత సుప్రింకోర్టు రంగంలోకి దిగింది.

సుప్రింకోర్టు రంగంలోకి దిగి చట్టాల అమలుపై స్టే విధించటమే కేంద్రానికి పెద్ద దెబ్బగా చెప్పుకోవాలి. ఆ తర్వాత ఎన్డీయేతర పార్టీలు కూడా కొత్త వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. అదే రోజు వేలాది ట్రాక్టర్లతో నిరసన ప్రదర్శన చేయాలని రైతుసంఘాలు తీర్మానించాయి. ఇప్పటికే సింఘు ప్రాంతంలో రోజుకు వేలాది మంది రైతులు దీక్షల్లో కూర్చుంటున్నారు.

ట్రాక్టర్ల ప్రదర్శనను సుప్రింకోర్టు అడ్డుకుంటుందని కేంద్రం భావించింది. అయితే దాన్ని పోలీసులే చూసుకోవాలని తేల్చేసింది. దాంతో కేంద్రానికి ఏమి చేయాలో దిక్కుతోచలేదు. ఇటువంటి పరిస్ధితుల్లో మొండిగా ముందుకెళితే రేపు జనవరి 26వ తేదీన ట్రాక్టర్ల ప్రదర్శనలో జరగరానిది ఏమైనా తలెత్తే పరిణామాలను కేంద్రం అంచనా వేసుకున్నట్లుంది. దాంతో అన్నీ వైపుల నుండి పెరిగిపోతున్న ఒత్తిళ్ళను తట్టుకోలేక చివరకు ఏడాదిన్నరపాటు కొత్త చట్టాల అమలును వాయిదా వేయబోతున్నట్లు ప్రతిపాదించింది.

అయితే ఈ ప్రతిపాదనకు రైతుసంఘాలు ఎగిరిగంతేమీ వేయలేదు. రైతుసంఘాల నేతలు సమావేశమై చర్చించుకుని ఏ సంగతి చెబుతామని కేంద్రానికి సమాదానమిచ్చాయి. తాము ప్రకటన చేసినట్లుగానే సుప్రింకోర్టులో ఓ అఫడివిట్ కూడా దాఖలు చేయటానికి రెడీగా ఉన్నట్లు కేంద్రమంత్రులు రైతుసంఘాలతో స్పష్టంగా చెప్పారు. అయితే ఎందుకో రైతుసంఘాలకు కేంద్రంపై నమ్మకం కుదరటం లేదు. పైకి ఒకటి చెప్పి లోలోపల మరొటి చేస్తుందేమో అన్న అనుమానాలు ఇంకా రైతుసంఘాలను వదలటం లేదు. మరి 22వ తేదీన జరగబోయే చివరి సమావేశంలో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.