ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో చిర్రుబుర్రులాడేవారు. బాధ్య‌త‌ల బ‌రువు, పాల‌నా ప‌ర‌మైన చిక్కుల‌తో ఆయ‌న ఎప్పుడూ ఒకింత ఆవేశంతో ఉండేవారు. కానీ, ఇటీవ‌ల కాలంలో అంటే.. కూట‌మి వ‌చ్చిన త‌ర్వాత‌.. కొంత రిలాక్డ్స్‌గానే ఉంటున్నారు. ముఖంలో చిరున‌వ్వులు చిందిస్తున్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తోనూ మ‌మేకం అవుతున్నారు. వైసీపీ బ‌లం త‌గ్గిపోవ‌డం..జ‌గ‌న్‌పై ప్ర‌జ‌ల‌కువ విశ్వ‌స‌నీయ‌త స‌న్నగిల్ల‌డంతో ఇక‌, కూట‌మికి తిరుగులేద‌న్న భావ‌న కూడా వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు.. చాలా రిలాక్స్ మోడ్‌లో క‌నిపిస్తున్నారు. ముఖ్యంగా ఏడాదిన్న‌ర‌గా చంద్ర‌బాబు ముఖంలో ఆనందం కూడా క‌నిపిస్తోంది. అయితే.. అనూహ్యంగా ఆయ‌న ఇప్పుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిప్పులు చెరిగారు. ఇలాంటి ప‌రిస్థితిని ఎప్ప‌టికీ.. ఉపేక్షించేది లేద‌ని అన్నారు. మ‌రి ఇంత ఆగ్ర‌హానికి కార‌ణం ఏంటి?  ఎంతో రిలాక్స్ మైండ్‌తో ఉంటున్న చంద్ర‌బాబు ఎందుకు నిప్పులు చెర‌గాల్సి వ‌చ్చింది? అనేది ఆస‌క్తిగా మారింది. దీనికి కార‌ణం.. కింది స్థాయి సిబ్బందో.. పార్టీ నాయ‌కులో కాదు. ఏకంగా జిల్లాల‌కు బాధ్యులుగా ఉన్న క‌లెక్ట‌ర్లే కావ‌డం గ‌మ‌నార్హం.

గురువారం, శుక్ర‌వారం రెండు రోజుల పాటు సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సును నిర్వ‌హించారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఇది 8వ స‌ద‌స్సు. అయితే.. తొలి రోజే క‌లెక్ట‌ర్లు వ్య‌వ‌హ‌రించిన తీరు.. చంద్ర‌బాబుకు చిర్రెత్తుకు వ‌చ్చింది. పాల‌న వ్య‌వ‌హారాలు.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు.. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరు వంటి కీల‌క విష‌యాల‌పై చంద్ర‌బాబు దిశానిర్దేశం చేస్తున్న స‌మ‌యంలో కొంద‌రు క‌లెక్ట‌ర్లు.. త‌మ ఫోన్ల‌ను ఆన్ చేసుకుని.. వాట్సాప్‌లో చాటింగులు చేస్తూ.. గ‌డిపేశారు. అంతేకాదు.. మ‌రికొంద‌రు చాలా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారు.

ఈ ప‌రిణామాలు.. ప‌త్రిక‌ల్లోను, మీడియాలోనూ ప్ర‌ముఖంగా వ‌చ్చాయి. ఈ వ్య‌వ‌హారంపై శుక్ర‌వారం చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బాధ్య‌తా యుత‌మైన క‌లెక్ట‌ర్లే ఇలా చేస్తే ఎలా అని నిల‌దీశారు. ఇక నుంచి క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సుకు ఫోన్ల‌ను తీసుకురావ‌ద్ద‌ని ఆదేశించారు. దీనికిగాను శుక్ర‌వారం వెంట‌నే ప్ర‌త్యేక సెల్ ఏర్పాటు చేసి.. అక్క‌డే క‌లెక్ట‌ర్ల ఫోన్ల‌ను డిపాజిట్ చేసే వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశారు. ఇది త‌గ‌ద‌ని.. క‌లెక్ట‌ర్లు ఇంత దిగ‌జారుతార‌ని అనుకోలేద‌ని అన్నారు. ఇక్క‌డే మ‌రో ప‌రిణామం కూడా చోటు చేసుకుంది. తొలి రోజు అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు స‌ద‌స్సుకు హాజ‌రుకాగా.. రెండో రోజు శుక్ర‌వారం కొంద‌రు క‌లెక్ట‌ర్లు చెప్పా పెట్ట‌కుండానే స‌ద‌స్సుకు డుమ్మా కొట్టారు. ఇది మ‌రింత‌గా చంద్ర‌బాబుకు ఆగ్ర‌హం తెప్పించింది. షోకాజు నోటీసులు జారీ చేయాల‌ని.. వివ‌ర‌ణ తీసుకోవాల‌ని ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఆదేశించారు.