జగన్ నమ్మకం ఏంటో అర్థం కావట్లేదే!

విశ్వాసం..అతి విశ్వాసం…ఈ రెండింటికి మధ్య ఒక సన్నని గీత ఉంది. ఈ విషయం తెలుసుకోకుండా చాలామంది రాజకీయ నేతలు తొందరపడుతుంటారు పుష్ప సినిమాలు అల్లు అర్జున్ మాదిరి నీయవ్వ తగ్గేదేలే అంటూ కామెంట్లు చేస్తుంటారు. వై నాట్ 175 అంటూ వైసీపీ అధినేత జగన్ 2024 ఎన్నికలకు ముందు అతి విశ్వాసంతో చేసిన కామెంట్లు ఆయనను ట్రోలింగ్ కు గురి చేశాయి. అయితే, ‘‘ఒక్కసారి చేస్తే పొరపాటు..అదే పొరపాటు మళ్లీ చేస్తే తప్పు’’…అని టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ అలియాస్ జగన్ చెప్పిన మాటలు వైసీపీ అధినేత జగన్ చెవికెక్కినట్లు కనబడడం లేదు.

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో జగన్ మరోసారి వై నాట్ 175 తరహా కామెంట్లు చేసి మరోసారి ట్రోల్ అవుతున్నారు. ఆ ఎన్నికలు సాఫీగా జరిగితే మాత్రం వైసీపీ ఎక్కడైనా కళ్లు మూసుకొని గెలుస్తుంది అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన అతి విశ్వాసాన్ని మరోసారి బట్టబయలు చేశాయి. ఈ మాట తాను కచ్చితంగా చెప్పగలను అంటూ జగన్ నమ్మకంగా చెబుతున్న వైనం చూస్తే జగన్ ఏ మాత్రం మారలేదు అనిపించక మానదు.

ఇక, ఆ ఎన్నికలు సాఫీగా జరగకపోయినా పర్వలేదని, ప్రజలకు తోడుగా పోటీలో గట్టిగా నిలబడాలని వైసీపీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. పోలీసులను, అధికారులను అడ్డుపెట్టుకొని వైసీపీని ఓడించే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుడితే…ఆ కార్యక్రమానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అయితే, ప్రతి పార్టీ అధినేత కూడా తమ పార్టీ మెజారిటీ స్థానాల్లో కచ్చితంగా గెలుస్తుందని చెప్పడం విశ్వాసం. తప్పు లేదు. కానీ, పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలుస్తుంది అని జగన్ మాదిరి చెప్పడం కచ్చితంగా అతి విశ్వాసం అవుతుంది. అతి విశ్వాసం చాలా సందర్భాల్లో అనర్థదాయకం అవుతుంది.

క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఏ మాత్రం అంచనావేయలేని జగన్ క్యాడర్ లో జోష్ నింపేందుకు ఇలా అతి విశ్వాసపు మాటలు చెప్పడం వల్ల ఫలితాలు ఘోరంగా ఉంటున్నాయి. ఇకనైనా జగన్ వాస్తవ పరిస్థితులు అంచనా వేసి వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. గ్రౌండ్ రియాలిటీ అంతా కూటమి పార్టీలకు అనుకూలంగా ఉన్నా, వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నా…జగన్ కాన్ఫిడెన్స్ వేరే లెవల్ లో ఉండడం మాత్రం అభినందనీయం..అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అసలు జగన్ నమ్మకం ఏంటో అర్థం కావడం లేదంటూ కొందరు నెటిజన్లు బుర్ర గోక్కుంటున్న ఎమోజీలు పెడుతున్నారు.