వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం చేస్తోంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. కీల‌క‌మైన, రాజకీయ చైత‌న్యం ఎక్కువ‌గా ఉన్న విజ‌య‌వాడ‌లో వైసీపీ పరిస్థితి.. చిన్నాభిన్నంగా ఉందనేది పార్టీ నాయ‌కులు చెబుతున్న మాట‌. ఇక్క‌డ ఎవ‌రూ యాక్టివ్‌గా లేరు. ఉన్న నాయ‌కులు కూడా ఎవ‌రికి వారే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో పార్టీప‌రిస్థితి దారుణంగా త‌యారైంది.

నియోజ‌వ‌క‌ర్గాల ప‌రంగా చూస్తే.. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్ లేక‌పోవ‌డం.. గ‌మ‌నార్హం. మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకు అధికారికంగా ఎలాంటి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌లేదు. విజ‌య‌వాడ తూర్పులోనూ ఇలానే ఉంది. ఇక్క‌డ నుంచే పోటీచేస్తాన‌ని దేవినేని అవినాష్ కోరుతున్నా.. ఆయ‌న‌కు ఇప్ప‌టికీ.. గ్రీన్ సిగ్న‌ల్ రాలేదు. ఇక విజ‌య‌వాడ వెస్టులోనూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో తీసుకువ‌చ్చిన నాయకుడు ఐపు లేకుండా పోయి.. చాలా కాల‌మే అయింది.

టీడీపీకి మేలు..

ఇక‌, అధికార టీడీపీ విష‌యానికి వ‌స్తే.. కూట‌మి పార్టీలు బ‌లంగా ఉన్నాయి. విజ‌య‌వాడ‌లోని రెండు నియోజ‌క‌వర్గాల్లో టీడీపీ ఏక‌ప‌క్షంగా విజ‌యం ద‌క్కించుకుంటే.. మిత్ర‌ప‌క్షం బీజేపీ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో పాగా వేసింది. ఇలా.. మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు.. కూట‌మి నాయ‌కుల ప్రాధాన్యం పెరిగింది. సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో బొండా ఉమా కు తిరుగులేద‌న్న టాక్ బ‌ల‌ప‌డింది. ఆయ‌న కూడా శ‌త్రువుల‌ను త‌గ్గించుకుంటూ.. వ‌ర్గ పోరుకు అవ‌కాశం లేకుండా.. అంద‌రినీ క‌లుపుకొని పోతున్నారు.

ఇక‌, ఆదినుంచి అజాత శ‌త్రువుగా పేరున్న తూర్పు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్‌ సైతం.. పార్టీని బ‌లోపేతం చేయ‌డంతో పాటు.. త‌న ఇమేజ్‌ను కాపాడుకుంటున్నారు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వారే విజ‌యం ద‌క్కించుకుంటార‌న్న చ‌ర్చ సాగుతోంది. ఇక‌, ప‌శ్చిమ‌లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి సైతం..అన్ని వ‌ర్గాల‌కు చేరువ అవుతున్నారు. త‌ద్వారా నియోజ‌క‌వ‌ర్గంలో త‌న హ‌వాను పెంచుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఫ‌లితంగా విజ‌య‌వాడ‌లో టీడీపీకి తిరుగులేద‌న్న టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.