వైసీపీకి బిగ్ షాక్… బొత్స మేనల్లుడు రాజీనామా

2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ నుంచి చాలామంది నేతలు వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. మునిగిపోయే టైటానిక్ వంటి వైసీపీ నుంచి బాలినేని, సాయిరెడ్డి, మోపిదేవి వంటి కీలక నేతలు దూకేశారు. నియోజకవర్గ స్థాయి నేతలు కూడా చాలామంది పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ షాక్ ఇచ్చింది వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు చిన్న శ్రీను.

లోకల్ వార్ మొదలు కావడానికి కొద్ది రోజుల ముందు ఉత్తరాంధ్రలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు ఆయన పంపించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి, భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌, విజయనగరం జడ్పీ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి కూడా వైదొలగుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. బొత్స కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చిన్న శ్రీను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు.

బొత్స కుటుంబానికి చెందిన నేత అయిన చిన్న శ్రీనుకు ఉత్తరాంధ్ర రాజకీయాలపై గట్టి పట్టుంది. ఆయన పార్టీని వీడడం…అందులోనూ స్థానిక సంస్థల ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పార్టీకి గుడ్ బై చెప్పడం పార్టీకి తీరని నష్టం అని చెప్పవచ్చు. అయితే, ఆ రాజీనామాకు గల కారణాలను ఆయన వెల్లడించాల్సి ఉంది. చిన్న శ్రీను జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే, తన రాజకీయ భవిష్యత్ కార్యచరణ గురించి ఆయన స్పందించాల్సి ఉంది.