అడుసు తొక్కనేల…కాలు కడగనేల..అనే సామెతను పెద్దలు ఊరికే వేయలేదు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు, రాజకీయ నేతల కుటుంబ సభ్యులు రాజకీయాల గురించి ఆచితూచి మాట్లాడాలి. కానీ, మాజీ మంత్రి కొండా సురేఖ తనయురాలు సుష్మిత మాత్రం సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించినట్లు కనిపించలేదు.
పోనీ ఆ వ్యాఖ్యలపై దుమారం రేగినప్పుడు కూడా సుష్మిత తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు కనిపించలేదు. కట్ చేస్తే కేవలం సుష్మిత వివాదాస్పద వ్యాఖ్యలు వల్ల సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు.
దీంతో, ఇప్పుడు సుష్మిత కన్నీటి పర్యంతమవుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. అయితే, కొండా సురేఖకు జరిగిన అవమానం జీర్ణంచుకోలేకపోతున్నా… తాను మాట్లాడిన మాటలకు తన తల్లిని బలి చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ సుష్మిత ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ దయ వల్ల సాధారణ కాంగ్రెస్ కార్యకర్త నుంచి ఈ స్థాయికి సురేఖ వచ్చారని అన్నారు. అటువంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆరోపించారు.
తన తల్లిదండ్రులు ఎన్నో కేసులు ఎదుర్కొన్నారని, ఎన్నోసార్లు జైలుకు వెళ్లారని చెప్పారు. రేవంత్ రెడ్డి తన తల్లిపై ఎంతో పగపెట్టుకున్నారని ఆరోపించారు. తన వ్యాఖ్యలు తన తల్లిని ఇంత ఇబ్బందులకు గురి చేస్తాయని తాను కలలో కూడా ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సుష్మిత సంగతి పక్కనబెడితే…సురేఖ అయినా తన కూతురు చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని, ఆ వ్యాఖ్యలను ఖండించలేదని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates