కొండా సురేఖకు బీఆర్ఎస్ లో నో ఎంట్రీ

మంత్రి కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఆమె భవిష్యత్ కార్యచరణపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. సురేఖ బీజేపీలో చేరతారని పుకార్లు వస్తున్నాయి. అయితే, అనూహ్యంగా గులాబీ గూటికి చేరేందుకు సురేఖ మొగ్గు చూపుతున్నట్లు ఆమె వ్యాఖ్యలు ఉంటున్నాయి. కేసీఆర్ చాలా మంచోడంటూ సురేఖ కితాబిచ్చిన వైనం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆమె బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్లు సంకేతాలిస్తున్నారని స్పష్టమైంది.

ఈ క్రమంలోనే కొండా సురేఖ ఆశలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నీళ్లు చల్లారు. కొండా సురేఖను బీఆర్ఎస్ పార్టీలోకి రానివ్వబోమని జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు తాకనివ్వబోమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో సురేఖకు బీఆర్ఎస్ తలుపులు మూసుకుపోయాయి. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిని తప్ప ఎవరినీ తీసుకోబోమని కరాఖండిగా జగదీష్ రెడ్డి చెప్పారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్లికేషన్ పెట్టినా తీసుకునే ప్రసక్తే లేదని, ఎన్నికల కంటే ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ బీఆర్ఎస్‌లోకి వస్తామంటే తీసుకోలేదని ఆయన బాంబు పేల్చారు. ఇక, ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎష్ లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

అంతకుముందు, బీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో కేసీఆర్ వ్యవహారశైలి బాగుండేదని, ఆయన చాలా మంచి వ్యక్తి అని సురేఖ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వ్యాఖ్యానించారు. తమను ఎంతో గౌరవంగా, హుందాగా రిసీవ్ చేసుకునేవారని ఆమె కొనియాడారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్‌తో ఎలాంటి విభేదాలు రాలేదని స్పష్టం చేశారు. అడిగిన వెంటనే తమ కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలోనే జగదీష్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో, కొండా దంపతులకు ఉన్న ఏకైక ఆప్షన్ బీజేపీనే.