జగన్ కేసుల లోగుట్టు సాయిరెడ్డి విప్పనున్నారా?

వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్ 2గా ఒక వెలుగు వెలిగారు విజయసాయిరెడ్డి. కట్ చేస్తే… సజ్జల ఎంట్రీతో విజయసాయి ప్రాభవం తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాతి కాలంలో ఇద్దరి మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు వెరసి సాయి రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.

అయితే, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. తనపై సజ్జల కోటరీ దుష్ప్రచారం చేయించిందని, సజ్జల తనపై గతంలో దాడి కూడా చేశారని సాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పుడు జగన్ కూడా ఆ విషయాన్ని పట్టించుకోలేదని, తనకు అవమానం జరిగినా ఆయన సైలెంట్ గా ఉన్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయం విజయసాయిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. పోతే పో అన్న రీతిలో తనను వదులుకున్న జగన్ కు ఇంకా స్వామిభక్తి చూపించాల్సిన అవసరం లేదని సాయిరెడ్డి భావిస్తున్నారట. అందుకే, ఇటీవల సజ్జలకు రాసిన లేఖలో అప్రూవర్ అంశాన్ని ఆయన తెరపైకి తెచ్చారట.

వాస్తవానికి ఆ విషయం అక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ, జగన్ వైఖరితో తీవ్ర మనస్తాపం చెందిన సాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకునే ఉద్దేశ్యంతోనే ఆ విషయం ప్రస్తావించారట. గతంలో అప్రూవర్ గా మారే ఛాన్స్ ఉన్నా మారలేదని ఆయన లేఖలో రాశారు. అంటే, ఇప్పుడు అప్రూవర్ గా మారి జగన్ ను ఇరుకున పెట్టాలని సాయిరెడ్డి భావిస్తున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది.

తన సేవలకు, త్యాగానికి, జైలు జీవితానికి ఏ మాత్రం విలువ, గుర్తింపు లేదన్న ఆవేదనతో విజయసాయిరెడ్డి రగిలిపోతున్నారట. అందుకే, తన కొత్త పార్టీ ప్రకటించడానికి ముందే సాయిరెడ్డి ఒక సంచలన ప్రెస్ మీట్ పెట్టబోతున్నారని టాక్ వస్తోంది. అక్రమాస్తుల కేసుల లోగుట్టును ఆయన విప్పబోతున్నారని పుకార్లు వస్తున్నాయి.

ఆడిటర్‌గా జగన్ క్విడ్ ప్రో కో వ్యాపారాలు, షెల్ కంపెనీల రూటింగ్, ఆర్థిక లావాదేవీల సాక్ష్యాలు… ఇలా జగన్ అక్రమాస్తుల కేసుల చిట్టాను చిత్రగుప్తుడి మాదిరిగా తన దగ్గర భద్రంగా సాయిరెడ్డి పెట్టుకున్నారట. ఒకవేళ ఇప్పుడు వస్తున్న ఊహాగానాలు, పుకార్లు నిజం చేస్తూ విజయసాయిరెడ్డి ఆ చిట్టాను అధికారుల ముందు విప్పితే మాత్రం జగన్ కు చిక్కులు తప్పవు.