కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం సిద్ధం చేసింది. చిన్నా రెడ్డి పంచాయతీ ని తేల్చనుంది. తద్వారా కాంగ్రెస్ పార్టీకి జరిగిన, జరగనున్న నష్టాన్ని అంచనా వేసుకునే హస్తం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. 

మొదట ఫైర్ బ్రాండ్ గా పేరున్న మంత్రి కొండా సురేఖ గురించి చెప్పుకుందాం. కొండా సురేఖ 2023 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో కూతురు సుస్మితను పరకాల అసెంబ్లీ నుంచి పోటీకి దించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా పరకాల సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికే ఇస్తున్నట్లు కన్ఫార్మ్ చేశారు. దీంతో కొండా ఫ్యామిలీ అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. 

కొండా సుస్మిత నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద యుద్ధం ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డికి అహంకారం పెరిగిందని, కాంగ్రెస్ పార్టీని తెలుగు కాంగ్రెస్ గా మార్చివేశారని తీవ్రమైన ఆరోపణలు చేసింది. అంతటితో ఊరుకోకుండా సీఎం కుటుంబం మీద అవినీతి ఆరోపణలు గుప్పించింది. ఇది కాంగ్రెస్ శ్రేణులకు మింగుడు పడలేదు.

కొండా సురేఖ ప్రోద్భలంతోనే సుస్మిత రెచ్చిపోతుందని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విరుచుకొని పడ్డారు. మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చినప్పటికి వివాదం చల్లారలేదు. చివరికి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో కలిసి మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ముందు చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి వచ్చింది. 

ఇక చిన్నా రెడ్డి విషయానికి వస్తే…రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా డా. చిన్నా రెడ్డి వ్యవహారిస్తున్నారు. వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డికి, చిన్నా రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వివాదాలు వున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల గోపాల్ పేటలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘా రెడ్డి మీద చిన్నా రెడ్డి చేసిన ఆరోపణలతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరింది.

2023 ఎన్నికల్లో మేఘా రెడ్డి కోట్ల రూపాయలు వెచ్చించి ఫార్మ్ బీ కొనుగోలు చేశారని ఆరోపించారు. దీనికి సాక్ష్యం చూపించాలని మేఘా పట్టుపట్టారు. చిన్నా రెడ్డి బీఆర్ఎస్ కోవర్ట్ అని, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో దొడ్డిదారి ఒప్పందం చేసుకొని ఇక్కడి సంగతులు అక్కడికి చేరవేస్తున్నాడని విమర్శలు చేశారు. ఈ పరస్పర ఆరోపణలు, విమర్శలతో కాంగ్రెస్ పరువు బజారులో పడిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

కొండా రెడ్డి, చిన్నా రెడ్డి ల వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. పార్టీ సీనియర్ నాయకులు సొంత ప్రయోజనాల కోసం విచక్షణ మరిచి రోడ్డెక్కడంతో అంతిమంగా పార్టీకి నష్టం జరుగుతుందని హై కమాండ్కు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దాంతో అధిష్టానం రంగంలోకి దిగింది. క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి ఇరువురు నేతలకు నోటీసులు ఇచ్చారు.

తాజాగా మల్లు రవి తన నివేదికను టీపీసీసీ అధ్యక్షుడికి అందించారు. కొండా సురేఖ, చిన్నా రెడ్డి లను పదవుల నుంచి తొలిగించాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీలో కథ ఇంతటితో ముగుస్తుందో లేకపోతే ఇక్కడి నుంచే మొదలవుతుందో వేచి చూడాలి.