పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి నేత జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని కాబట్టి నన్ను అణచివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు కూడా చేశారు. జోగి రమేష్ కుమారుడు రాజీవ్, కోడలు మేఘన మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడి రచ్చకెక్కడంతో కొద్దిరోజులుగా ఈ అంశం రాజకీయ రంగు కూడా పులుముకుంది.
దీనిపై ఈరోజు జోగి రమేష్ వివరణ ఇచ్చారు.. “కుటుంబ సమస్యలు ఏ కుటుంబంలో లేవయ్యా చంద్రబాబు? ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా? ప్రతి కుటుంబంలోనూ సమస్యలు ఉంటాయి. మేఘన నా కూతురితో సమానం. రాజీవ్, మేఘన కలిసి ఉండాలన్నదే ఇప్పటికీ నా కోరిక” అని జోగి రమేష్ అన్నారు. తన కుమారుడు రాజీవ్కు బాధ్యతగా ఘనంగా వివాహం చేశానని, పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని తెలిపారు. వారిద్దరూ కలిసి ఉండాలని తాము కోరుకున్నామని, సఖ్యత కోసం ప్రయత్నాలు కూడా చేశామని చెప్పారు. అయితే విభేదాలు పెరగడంతో రాజీవ్ విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారని వెల్లడించారు.
మాపై దుష్ప్రచారం చేస్తున్నారు.
ఈ నెలలో తమ కుటుంబంపై కోడలు మేఘన ఫిర్యాదు చేశారని జోగి రమేష్ తెలిపారు. ఫిర్యాదులో మతమార్పిడి అంశాన్ని కూడా ప్రస్తావించారని చెప్పారు. తమను మానసిక క్షోభకు గురిచేసేలా దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు.
ఫేక్ వీడియోలు, ఆడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారు. ఐటీడీపీ ఎక్స్ ఖాతాలో నాపై దుష్ప్రచారం చేశారు. నెల రోజులుగా మాపై ఏఐ తో రూపొందించిన వీడియోలను సృష్టించి ప్రచారం చేస్తున్నారు” అని జోగి రమేష్ ఆరోపించారు.
తాను బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని కావడంతోనే తనను అణచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కుటుంబ వివాదాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం సరికాదని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates