వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్ట‌రేట్‌(ఈడీ) అధికారులు 24 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు పైగా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రెండు బ్యాంకు లాక‌ర్ల‌కు సంబంధించిన తాళాల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే బ్యాంకు స్టేట్‌మెంట్లు, ప‌లు కీల‌క ప‌త్రాల‌ను కూడా త‌మ వెంట తీసుకువెళ్లారు. ఇంట్లోని కంప్యూట‌ర్ హార్డ్ డిస్క్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

తాము స్వాధీనం చేసుకున్న 24 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు పైగా సొమ్ముకు ఎలాంటి లెక్క‌లు చెప్ప‌లేద‌ని ఈడీ అధికారులు తెలిపారు. అలాగే.. రెండు లాక‌ర్ల‌లో ఏమున్నాయంటే.. ఎంపీ బంధువులు ఏమీ చెప్ప‌డం లేద‌న్నారు. ఇక‌, ప‌లు ప‌త్రాలు కూడా తీసుకున్నామ‌ని తెలిపారు. ఈ మేర‌కు ఇంట్లోని వారికి నోటీసులు ఇచ్చారు. శుక్ర‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన త‌నిఖీలు.. సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు జ‌రిగాయి. త‌నిఖీలు జ‌రుగుతున్న స‌మ‌యంలో స్థానిక పోలీసులు ఇంటికి కాపలాగా ఉన్నారు.

జ‌గ‌న్ ఆరా..

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు త‌నిఖీలు చేస్తున్న విష‌యంపై హైద‌రాబాద్‌లో ఉన్న జ‌గ‌న్ ప్ర‌తి గంట‌కు ఒక‌సారి ఫోన్ చేసి ఆరా తీసిన‌ట్టు తెలిసింది. ఏం జ‌రిగినా భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని.. తాను చూసుకుంటాన‌ని ఆయ‌న ఎంపీ స‌తీమ‌ణికి హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. కాగా.. జ‌గ‌న్ ఐపీఎస్ అధికారి సీతారామాంజ‌నేయులు కుమారుడి వివాహం నిమిత్తం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించారు. అటు నుంచి ఆయ‌న బెంగ‌ళూరుకు వెళ్లిపోయారు.

ఎందుకీ త‌నిఖీలు..

వైఎస్ జ‌గ‌న్ బాబాయి.. వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి 4 కోట్ల రూపాయ‌ల సుపారీ సొమ్ము చేతులు మారింద‌ని సీబీఐ అధికారులు త‌మ చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఈ సొమ్ము ఎలా వ‌చ్చింది? ఎవ‌రు ఇచ్చారు?  ఏయే వ్య‌క్తుల‌కు ప్ర‌మేయం ఉన్నద‌న్న విష‌యాల‌పై ఈడీ కేసు న‌మోదు చేసింది. దీనిలో భాగంగానే అవినాష్ రెడ్డి స‌హా.. ఈ కేసులో ప్ర‌ధాన నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి స‌హా..  ప‌లువురి ఇళ్లు, కార్యాల‌యాల్లో శుక్ర‌వారం త‌నిఖీలు చేసింది.