తెలంగాణలో తొలి టీకా ఎవరికంటే..

నిరీక్షణ ఫలించింది. మరో రెండు రోజుల్లో మాహమ్మారికి చెక్ పెట్టే టీకాను వాడటం షురూ చేయనున్నారు. తొలిదశలో వైద్యులు.. వైద్య ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ మీద పలు సందేహాలు వస్తున్న వేళ..అలాంటి వాటికి చెక్ చెబుతూ.. తెలంగాణలో తొలి టీకా తానే వేయించుకుంటానని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పటం తెలిసిందే.

పలు సందర్భాల్లో తొలి టీకాను తానే వేయించుకుంటానని ఆయన చెప్పారు. అయితే.. అందుకు భిన్నంగా తెలంగాణలో తొలి టీకాను గాంధీ ఆసుపత్రిలో గడిచిన పది నెలలుగా విశేష సేవలు అందిస్తున్న ఒక పారిశుద్ధ్య కార్మికుడికి వేయనున్నట్లు వెల్లడించారు. పదహారు ఉదయం ఆ సఫాయి కర్మచారికి వ్యాక్సిన్ వేయటం ద్వారా.. తెలంగాణలో తొలి టీకా వేసినట్లు అవుతుంది.

తొలిరోజున 139 కేంద్రాల్లో టీకాలు వేయాలని భావించారు. అందులో 99కేంద్రాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. మిగిలిన 40 కేంద్రాలు ప్రైవేటు ఆసుపత్రిలో అని నిర్ణయించారు. తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చారు. తొలిరోజున టీకాలు వేసే 139 కేంద్రాలు ప్రభుత్వ రంగానికి చెందినవే ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

తొలి వారం పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించి.. రెండో వారం నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడతామని చెబుతున్నారు. ఇక.. మొదట్లో చెప్పినట్లుగా మొదటి రోజు వంద టీకాలు ఇవ్వకుండా.. తక్కువ మందికే ఇవ్వనున్నారు. ఒక క్రమపద్దతిలోనే టీకాల్ని పెంచుకుంటూ వెళదామని భావిస్తున్నారు.

టీకా వేసిన వారికి ధ్రువపత్రం ఇవ్వటంతోపాటు.. వారి మొబైల్ నెంబరును రిజిస్టర్ చేస్తారు. టీకా వేసుకున్న తర్వాత ఫోన్ కే ధ్రువపత్రాన్ని అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇక.. టీకా కోసం అతి సురక్షితమైన ఏడీ సిరంజీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒకరికి టీకా వేసిన తర్వాత.. రెండో వారికి ఈ సిరంజిలు అస్సలు పని చేయవు. ఇది అత్యంత సురక్షితమైన టీకాగా చెబుతున్నారు.