నాకు కోర్టు అనుమతి అవసరం లేదు: లోకేష్

డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ అధినేత జగన్, వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ ఆరోపణలు నిరూపించాలని జగన్ కు విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ ఛాలెంజ్ చేశారు. ఆ ఆరోపణలపై ఆధారాలతో చర్చకు రావాలని జగన్ కు లోకేశ్ మూడు సార్లు సవాల్ చేసినా జగన్ స్పందించలేదు. ఈ క్రమంలోనే ఈ రోజు అసెంబ్లీలో మరోసారి జగన్ కు లోకేశ్ సవాల్ విసిరారు.

గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ ను నాలుగోసారి ఛాలెంజ్ చేస్తున్నానని, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని లోకేశ్ నిండు సభలో సవాల్ విసిరారు. జగన్ అనే వ్యక్తి తనను, సీఎం చంద్రబాబును కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్నే ప్రశ్నిస్తున్నారని లోకేశ్ అన్నారు. ఏ అంశంపై అయినా చర్చకు తాము సిద్ధమని లోకేశ్ చెప్పారు. ప్రెస్ మీట్ లు పెట్టడం కాదని, సభలోపల..సభ వెలుపల చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
11 మంది పట్టే బ్లాక్ కూడా ఉందని, చర్చకు రావాలని జగన్ ను డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే జగన్ పై లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షా..ఈ రోజు ప్రతిపక్ష పార్టీ…అనబోయిన లోకేశ్…క్షమించాలి అంటూ వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదన్న విషయాన్ని సెటైరికల్ గా చెప్పారు. ఇక, తాను గొడ్డలి పార్టీ అధ్యక్షుడిలాగా పారిపోవడం లేదని, తాను ఎక్కడికైనా వెళ్లాలంటే తనకు కోర్టు అనుమతి అవసరం లేదని లోకేశ్ అన్నారు. తనపై సీబీఐ కేసులు లేవని గుర్తు చేశారు. 2029 ఎన్నికలకు ముందు మరో 3 డీఎస్సీలు వేస్తామని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని లోకేశ్ చెప్పారు.