రైతుల్లో ఇంత ఆగ్రహముందా ?

మూడు నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల్లో ఎంత ఆగ్రహం పేరుకుపోతోందో తాజాగా జరిగిన ఓ ఘటనే నిదర్శనంగా నిలిచింది. వ్యవసాయ చట్టాలకు మద్దతుగా హర్యానా ప్రభుత్వం కర్నల్ జిల్లాలోని కైమ్లాలో సభ నిర్వాహించాలని డిసైడ్ అయ్యింది. దీనికి ముఖ్య అతిధిగా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ హాజరవ్వాల్సుంది. భారీ సభకు ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. అయితే ఊహించని మలుపుతో మొత్తం సభ రద్దయిపోయింది.

ఇంతకీ ఏమి జరిగిందంటే కైమ్లాలో సభ జరుగుతోందని తెలుసుకున్న రైతుసంఘాల నేతలు, రైతులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకున్నారు. అయితే గ్రామంలోకి వారిని పోలీసులు అనుమతించలేదు. దాంతో పెద్దఎత్తున గొడవలు జరిగింది. రైతులపైకి పోలీసులు జలఫిరంగులను, భాష్పావాయువుని ప్రయోగించినా రైతులు లొంగలేదు. పోలీసులను ఛేదించుకుని రైతులు పోలోమంటూ సభ జరిగే ప్రాంతానికి చొచ్చుకుపోయారు.

సభా ప్రాంగణంలో వేసిన కుర్చీలను విరగ్గొట్టేశారు. అలాగే వేదికను పూర్తిగా ధ్వంసం చేసేశారు. ఇది సరిపోదన్నట్లుగా ఖట్టర్ దిగాల్సిన హెలిప్యాడ్ ను కూడా రైతులు స్వాధీనం చేసుకున్నారు. రైతుల ఆగ్రహం దెబ్బకు చివరకు పోలీసులే తోకముడవాల్సొచ్చింది. జరిగిందంతా తెలుసుకుని చివరకు ముఖ్యమంత్రి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత జరిగిన మొట్టమొదటి హింసాత్మక ఘటనగా దీన్ని చెప్పుకోవాలి.

ఒకసారంటూ ఘటనలు మొదలైతే ఇక ఇతర ప్రాంతాలకు పాకటానికి ఎంతోకాలం పట్టదు. ఇప్పటికే పంజాబులో వేలాది రైతులు అంబానీ, అదానీల వ్యాపార సముదాయాల మీద, జియో టవర్ల మీదపడి ధ్వంసం చేసిన ఘటనలు అందరికీ తెలిసిందే. ఒక్క పంజాబులో మాత్రమే 1500 జియో టవర్లు ద్వంసం అయిపోయాయి. రైతుల ఉద్యమఫలితంగా వీళ్ళ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ముందు ముందు కైమ్లా ఘటనలు ఇతర ప్రాంతాల్లో రిపీట్ కాకుండా ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాయో చూడాల్సిందే. సరే ఎలాగూ సందట్లో సడేమియా లాగ ప్రతిపక్షాలు ఎలాగూ దీన్ని క్యాష్ చేసుకునేందుకు చూస్తాయి కదా అదే పనిలో ఉన్నాయి.