మూసీకి కొబ్బ‌రికాయ కొట్టేశారు!

హైద‌రాబాద్ సుంద‌రీక‌ర‌ణ‌లో భాగంగా కీల‌కమైన మూసీ న‌దిని ప్ర‌క్షాళ‌న చేసే కార్య‌క్ర‌మానికి రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ప్ర‌క్షాళ‌న వేగవంతంగా జ‌ర‌గాల‌ని.. ల‌క్ష్యం ప్ర‌కారం ప‌నులు ముందుకు సాగాల‌ని పేర్కొంది. ఈ మేర‌కు ప‌రిపాల‌న‌, ఆర్థిక ప‌ర‌మైన అనుమ‌తులు ఇస్తూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో మూసీ పున‌రుజ్జీవ ప్రాజెక్టు ప‌నులు ప్రారంభం కానున్నాయి.

మొత్తం రెండుద‌శ‌ల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా నిర్దేశించుకుంది. దీనినే జోన్‌- 1, జోన్‌-2గా పేర్కొంటున్నారు. ప్ర‌స్తుతం జోన్‌-1కు అనుమ‌తి ల‌భించింది. జోన్ – 1 హిమాయ‌త్ సాగ‌ర్ నుంచి బాపూ ఘాట్ వ‌ర‌కు ఉన్న మూసీ ప‌రివాహ‌కాన్ని అత్యంత ర‌మ‌ణీయంగా తీర్చిదిద్ద‌నున్నారు. ఘాట్‌కు ఇరు వైపులా సుంద‌ర నంద‌న వ‌నాన్ని పెంచ‌నున్నారు. ప‌ర్యాట‌కులు వ‌చ్చేందుకు వీలుగా దీనిని ప్రపంచ స్థాయిలో సుందరీక‌రిస్తున్నారు.

మూసీ ప్ర‌క్షాళ‌న‌లో భాగంగానే 2024 జూన్‌లో హైడ్రా వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చారు. దీంతో అప్ప‌టి నుంచి మూసీ ప‌రివాహ‌క ప్రాంతాన్ని ఆక్ర‌మించి చేప‌ట్టిన నిర్మాణాల‌ను హైడ్రా తొల‌గించింది. దీంతో జోన్‌-1 ప‌నుల‌కు ఎలాంటి ఆటంకాలు ఉండ‌వ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ తొలి ద‌శ ప‌నుల‌కు 7345 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చ‌వుతాయ‌ని అంచ‌నా వేశారు. వీటిలో ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి 4500 కోట్ల రూపాయ‌లు అప్పు తీసుకునేందుకు కూడా స‌ర్కారు ఓకే చెప్పింది.

ఇక‌, మిగిలిన 2800 కోట్ల రూపాయ‌ల పైచిలుకు సొమ్మును హైద‌రాబాద్ మెట్రో డెవ‌ల‌ప్‌మెంటు అథారిటీ నుంచి అప్పుగా తీసుకునేందుకు కూడా ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. దీంతో ప‌నులు ప్రారంభించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. అలాగే.. మూసీ ప్రాజెక్టును నిర్వ‌హించేందుకు వీలుగా ఓ కన్సల్టెన్సీ సంస్థ‌ను నియ‌మించుకునేందుకు కూడా ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. దీంతో ప‌నులు వేగంగా ముందుకు సాగ‌డంతోపాటు ల‌క్ష్యం మేర‌కు పూర్త‌వుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.