ఏపీలోని అల్లూరి సీతారామ రాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలో విస్తరించిన అరకు పార్లమెంటు స్థానం పెద్దది. ఈ నియోజకవర్గం పరిధిలో పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకులోయ, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియో జకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఒక్క పార్వతీపురం మినహా అన్నీ ఎస్టీ నియోజకవర్గాలే కావడం గమనార్హం. పార్వ తీపురం కూడా ఎస్సీలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గం. ఈ ఏడు నియోజకవర్గాల్లోనూ వైసీపీకి బలమైన కేడర్తోపాటు నాయకులు కూడా ఉన్నారు.
2024లో కూటమి పార్టీల ప్రభావం కనిపించినప్పటికీ.. ఈ ఏడు స్థానాల్లో రెండు చోట్ల.. అరకు, పాడేరు నియోజకవర్గాల్లో వైసీపీ విజయం దక్కించుకుంది. సో.. దీనిని బట్టి వైసీపీ బలం ఎలా ఉందో అర్ధం అవుతుంది. అయితే.. తాజాగా అరకు పార్లమెంటు స్థానంతోపాటు ఈ ఏడు నియోజకవర్గాలపై జనసేన వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని నిర్ణయించింది. వచ్చే 2029 ఎన్నికల్లో మొత్తం పార్లమెంటు స్థానంతోపాటు ఏడు స్థానాల్లో పోటీకి సిద్ధం కావాలని తాజాగా జనసేన కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు నాయకులకు సూచించారు.
ఎట్టి పరిస్థితిలోనూ విజయం దక్కించుకోవాలని ఆయన సూచించారు. పార్టీ నాయకులతో అరకు పార్లమెంటు స్థానంలోని ఓ రిసార్టులో నిర్వహించిన సమావేశంలో వచ్చే ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న విషయంపై ఆయన దిశానిర్దేశం చేశారు. పాడేరు, అరకు స్థానాల్లో గెలుపు తథ్యమని.. అయితే కొంత మేరకు కష్టపడాలని ఆయన తెలిపారు. ఇక, మిగిలిన నియోజకవర్గాల్లోనూ జనసేన హవా ప్రభావం కనిపిస్తోందని నాగబాబు చెప్పారు. లోక్సభ స్థానంలోనూ ఈ దఫా జనసేన గెలిచి తీరుతుందని ఆయన చెప్పడం గమనార్హం.
ఈ వ్యూహం ఎందుకంటే..
గిరిజన ప్రాబల్య నియోజకవర్గం అయిన అరకులో ఆరు స్థానాలు గిరిజనులకే కేటాయించారు. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ తరచుగా గిరిజన సమస్యలు పరిష్కరించడంలో ముందుంటున్నారు. అలానే.. రహదారుల నిర్మాణం, విద్యుత్తు అందించడం సహా వ్యక్తిగత సాయంతోపాటు.. గిరిజనుల ఆరోగ్యంపైనా దృష్టి పెట్టారు. ఇది జనసేనలో నమ్మకాన్ని మరింత పెంచింది. అలానే.. జనసేన తరపున పోటీ చేసేందుకు కూడా గిరిజన యువత ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అరకు పార్లమెంటు స్థానంలో పూర్తిస్థాయి నియోజకవర్గాల్లో విజయం దక్కించుకోవాలన్నది జనసేన వ్యూహం. తద్వారా వైసీపీకి బలంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలను తమవైపు తిప్పుకోవడం ద్వారా ఆపార్టీని దెబ్బకొట్టవచ్చని కూడా జనసేన అంచనా వేస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
