విజయ్ సర్కారును కూల్చేందుకు ఇంత పెద్ద కుట్ర?

తమిళనాడు వ్యవహారాలు ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే తెర తీస్తున్నాయి. ఇటీవలే జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన దళపతి విజయ్ ఘన విజయం సాధించి సినిమా హీరో నుంచి నేరుగా సీఎం కుర్చీలో కూర్చున్నారు. తాజాగా విజయ్ సర్కారును కూల్చేందుకు ఓ భారీ యత్నమే జరిగిందని, దానిని తమిళనాడు పోలీసులు భగ్నం చేశారన్న వార్తలు బుధవారం కలకలం రేపాయి.

దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో తమిళనాడు పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరంతా ఓ కన్సల్టెన్సీ సంస్థకు చెందిన వారిగా పోలీసులు నిర్ధారించారు. ఈ వ్యవహారంపై ముందస్తు సమాచారం అందుకున్న తమిళనాడు ఇంటెలిజెన్స్ వర్గాలు విజయ్ సర్కారును అప్రమత్తం చేశాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కుట్రకు పథకం పన్నినట్టుగా భావిస్తున్న సదరు కన్సల్టెన్సీ సంస్థకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసింది.

అసలు ఈ కుట్ర కోణం ఏమిటన్న విషయానికి వస్తే… తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు పూర్తి స్థాయి మెజారిటీ దక్కని సంగతి తెలిసిందే. అయితే అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే.. కాంగ్రెస్, వామపక్షాలు, మరో రెండు ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయ్ సర్కారు ఏ క్షణాన్నైనా కూలిపోవడం ఖాయమన్న వాదనలూ వినిపించాయి. ఇదే వాదనను ఆసరా చేసుకున్న కొందరు వ్యక్తులు టీవీకేకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దిశగా కుట్రకు పథక రచన చేశారు.

ఈ వ్యవహారానికి సూత్రధారిగా డీఎంకే నేత, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఎంకేలో కీలక భూమిక పోషిస్తున్న బాలాజీనే ఈ వ్యవహారాన్ని నడిపారన్న వార్తలు ఇప్పుడు పెను కలకలమే రేపుతున్నాయి. ప్రస్తుతం అరెస్టు అయిన ముగ్గురు వ్యక్తులను విచారించిన తర్వాత బాలాజీ పాత్రపై స్పష్టత వస్తుందని, ఈ క్రమంలో బాలాజీ కూడా ఈ వ్యవహారంలో అరెస్టు కాక తప్పదన్న వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే… తమిళనాడు పెను రాజకీయ సంక్షోభం తప్పదన్న విశ్లేషణలు సాగుతున్నాయి.