ఎన్నిక‌ల ముంగిట బీజేపీకి అయోధ్య ఎఫెక్ట్ ఎంత‌?

బీజేపీకి అత్యంత కీల‌క‌మైన ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల‌కు ముందు చెల‌రేగిన అయోధ్య రామ‌మందిర వివాదం కీల‌క మ‌లుపులు తిరుగుతోంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం కావ‌డం.. 80 పార్ల‌మెంటు నియోజ‌న‌క‌వ‌ర్గాలు ఉన్న ఏకైక రాష్ట్రం కావ‌డంతో ఈ స్టేట్‌పై బీజేపీ ప్ర‌త్యేక దృష్టి పెట్టిన విష‌యం తెలిసిందే. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న యోగి ఆదిత్య‌నాథ్‌ను తీసుకువ‌చ్చి ఉత్త‌ర ప్ర‌దేశ్ సీఎంగా కూడా చేశారు. త‌ద్వారా.. రాష్ట్రంలో ప‌క్కాగా బీజేపీని బ‌లోపేతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగారు.

ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రుస‌గా రెండు సార్లు.. యూపీలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. మ‌రో నాలుగు నుంచి ఐదు మాసాల్లోనే మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు రెడీ అయ్యే ప‌రిస్థితి వ‌చ్చింది. వాస్త‌వానికి వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. మార్చి 31నాటికి.. అసెంబ్లీ గ‌డువు పూర్త‌వుతుంది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అయితే.. స‌ర్ ప్ర‌క్రియ సాగుతున్న నేప‌థ్యానికి తోడు జ‌నాభాగ‌ణన కూడా ప్రారంభం అవుతున్న క్ర‌మంలో ఈ ఏడాది అక్టోబ‌రు లేదా న‌వంబ‌రులో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. చిత్రంగా ఏ అంశం ఆధారంగా యూపీలో బీజేపీ పాగా వేసిందో.. దేనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని ప్ర‌జ‌ల మ‌న‌సులు దోచుకుని అధికారంలోకి వ‌చ్చిందో ఇప్పుడు అదే అంశం… బీజేపీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. అదే.. రామ‌జ‌న్మ‌భూ మిలో సుదీర్ఘ పోరాటం త‌ర్వాత నిర్మించిన అయోధ్య రామాల‌యం. దీనిని సాధిస్తామ‌ని, సాధించామ‌ని చూపించే.. బీజేపీ ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చింది. అయితే.. తాజాగా అయోధ్య రామాల‌యంలో భ‌క్తులు స‌మ‌ర్పించిన కోట్ల రూపాయ‌ల కానుల‌కు, ఆభ‌ర‌ణాలు కూడా గ‌ల్లంత‌య్యాయి.

దాదాపు 11 కోట్ల రూపాయ‌లు క‌నిపించ‌డం లేద‌ని అధికారులే చెప్పారు. కానీ అక్క‌డ జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని బ‌ట్టి దాదాపు వంద‌ల కోట్ల‌లోనే అక్ర‌మాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు కీల‌క‌మైన తీర్థ క్షేత్ర ట్ర‌స్టు చైర్మ‌న్ కూడా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ప్ర‌భుత్వం ఎంతగా దీనిని క‌ప్పి పుచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నా.. ఎక్క‌డా ఆగ‌డం లేదు. ఏపీలో తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం ఎలా అయితే.. ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చిందో .. ఇప్పుడు యూపీలో అయోధ్య రామాల‌య కానుక‌ల గ‌ల్లంతు వ్య‌వ‌హారం కూడా దుమారం రేపుతోంది.

స‌నాత‌న ధ‌ర్మం, భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తీశారంటూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం స‌మాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ స‌హా.. ఇత‌ర ప‌క్షాలు కూడా యోగి ఆదిత్య‌నాథ్ స‌ర్కారుపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇక‌, సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున రోజుకొక క‌థ‌నం తెర‌మీదికి వ‌స్తోంది. అలాగే అధికారులు కూడా రోజుకొక విష‌యాన్ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రో నాలుగు నెల్ల‌లోనే ఎన్నిక‌లు ఉండ‌డం బీజేపీకి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. దీనిని ఎదుర్కొన‌డం ఇప్పుడు బీజేపీకి పెద్ద‌స‌వాలేన‌ని జాతీయ మీడియా సైతం చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.