విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా అతనిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సిట్ బృందంలోని ఇద్దరు కీలక అధికారులు.. విజయవాడ శివారు ప్రాంతంలోని ఆయన ఇంటికి చేరుకుని విచారణ చేస్తున్నారు. ఇంతలోనే షాకింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
1) దర్యాప్తు బృందంలో మార్పు
విజయవాడ సాయి కృష్ణ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాయి కృష్ణ విషయంలో విచారణ చేపట్టడానికి ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే వాస్తవానికి రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్తో బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. ఆయన స్థాయి సరిపోదంటూ.. విపక్షం వైసీపీ నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వం ఆదివారం ఉదయం కీలక నిర్ణయం తీసుకుని ఐజీ రవి ప్రకాష్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ బృందంలో నలుగురు ఎస్సీలను నియమించింది.
వీరిలో అద్నాన్ నయీం సమీ, పశ్చిమ గోదావరి ఎస్పీ, అమిత్ బార్డర్ అల్లూరు సీతారామరాజు జిల్లా.ఎస్పీ సహా ఎల్ సుధాకర్, అడిషనల్ ఎస్పీ బాపట్ల ఉన్నారు. ఈ నేపథ్యంలో సాయికృష్ణ హత్య కేసులో కృష్ణలంక సీఐ నాగరాజును అరెస్ట్ చేసేందుకు అజిత్ సింగ్ నగర్ షాదీ ఖానా ప్రాంతంలో ఆయన నివాసానికి అధికారులు చేరుకున్నారు. ఇప్పటికే ఆయన నివాసంలో సీఐ నాగరాజు ను డీసీపీ లతాకుమారి విచారిస్తున్నారు. ఆయనను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
2) నాగరాజుకు మద్దతుగా సంఘాలు
మరోవైపు.. నాగరాజును అరెస్టు చేస్తారన్న వార్త వెలుగు చూడగానే.. ఆయనకు మద్దతుగా స్థానిక ప్రజా సంఘాలు ధర్నాకు నిరసనకు పిలుపునిచ్చాయి. నాగరాజును సిన్సియర్ అధికారిగా పేర్కొంటున్న వీరు.. ఆయనను అరెస్టు చేయడానికి వీల్లేదని నినాదాలతో హోరెత్తించారు. అంతేకాదు.. నాగరాజు అరెస్టును అడ్డుకుని తీరుతామని కూడా చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారం.. ఎటు నుంచి ఎటు దారితీస్తుందో అన్న చర్చ జోరుగా సాగుతోంది. కాగా.. నాగరాజుపై ఎఫ్ ఐఆర్ నమోదై.. 75 గంటలు గడిచాయి. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. ఆయనను అరెస్టు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నట్టు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates