ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో పోలీసులు నానీకి నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. అయితే.. ఈ కేసు వైసీపీ హ‌యాంలోనే న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. అప్ప‌ట్లో వైసీపీ అధికారంలో ఉండ‌డంతో ఈ కేసు విచార‌ణ ముందుకు సాగలేదు. తాజాగా నానీ విచార‌ణ‌కు అనుమ‌తించాల‌ని కృష్నాజిల్లా క‌లెక్ట‌ర్ కోర‌డంతో ప్ర‌భుత్వం ఓకే చెప్పింది.

ఏంటీ కేసు?

2021లో వైసీపీ హ‌యాంలో స్థానిక ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ స‌మ‌యంలో క‌రోనా కార‌ణంగా.. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను వాయిదా వేశారు. దీంతో అధికార పార్టీ నాయ‌కులు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అప్ప‌ట్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సైతం.. మీడియా మీటింగ్ పెట్టి.. ర‌మేష్‌కు కులం అంట‌గ‌ట్టిన విష‌యం కూడా చ‌ర్చ‌కు దారితీసింది.

స‌రిగ్గా ఆ స‌మ‌యంలోనే ఎమ్మెల్యేగా ఉన్న నాని.. ర‌మేష్‌పైనా.. అప్ప‌టి ప్ర‌తిపక్ష నేత చంద్ర‌బాబుపైనా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దూష‌ణ‌లు గుప్పించారు. వాడు-వీడు అంటూ సంబోధించారు. ఇది ఎన్నికల నిబంధ‌న‌ను తోసిపుచ్చ‌డ‌మేన‌ని నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ వ్యాఖ్యానించారు. దీనిపై అప్ప‌ట్లోనే ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో.. గుడివాడ పోలీసులు నానీపై కేసు న‌మోదు చేశారు.

అయితే.. ఆ త‌ర్వాత ఏడాదికే కొడాలి నానీని జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు. దీంతో మంత్రిగా ఉన్న నానిని విచారించాలంటే.. అప్ప‌టి ప్ర‌భుత్వం అనుమ‌తించాల్సి ఉంది. కానీ, అప్ప‌ట్లో అధికారులు సాహ‌సం చేయ‌లేకపోయారు. ఆ త‌ర్వాత‌.. ఈ కేసు మ‌రుగున ప‌డింది. తాజాగా.. ఈ కేసు విచార‌ణ చేపట్టేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో కృష్ణాజిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌భుత్వాన్ని కోరారు. దీంతో నానీని విచారించేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇస్తూ.. తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఏం జ‌రుగుతుంది?

ఎన్నిక‌ల నియ‌మావ‌ళి కేసులు దాదాపు కొలిక్కివ‌చ్చేందుకు ఏళ్ల స‌మ‌యం ప‌డుతుంది. పైగా.. ఐదేళ్ల నాటి కేసు కావ‌డంతో సాక్ష్యులు, ఆధారాలు కీల‌కం. పైగా.. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి కేసులు దాదాపు తేలిపోతాయే త‌ప్ప‌.. శిక్ష‌లు ప‌డిన సంద‌ర్భాలు లేవు. దీంతో ఈ కేసు కూడా అలానే జ‌ర‌గ‌వ‌చ్చ‌ని న్యాయ‌వాదులు చెబుతున్నారు. మ‌రోవైపు.. కొడాలి నానీ కార్యాల‌యం ఈ కేసును రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌గా పేర్కొంది. విజ‌య‌వాడ సాయికృష్ణ కేసును దారిమ‌ళ్లించే చ‌ర్యగా నానీ అనుచ‌రులు ఆరోపించారు.