గోదావరి జిల్లాల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తీర్పు ఇస్తే రాష్ట్రంలో అధికారం ఎవరిదో తేలిపోతుందనేది ఒక బలమైన సెంటిమెంట్. 2014లో అయినా, మొన్నటి ఎన్నికల్లో అయినా పశ్చిమ జనం కూటమికి వన్సైడ్ విజయాన్ని అందించి బ్రహ్మరథం పట్టారు. అయితే, అధికారం దక్కిన ఆనందం ఎంతో కాలం నిలవలేదు.
ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు అజమాయిషీ చలాయించుకునే క్రమంలో చాలా నియోజకవర్గాల్లో వేరు కుంపట్లు రాజుకున్నాయి. ఈ అంతర్గత పోరు ఇప్పుడు అమరావతి వరకు చేరడంతో అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు, టీడీపీ ఇన్చార్జ్ వలవల బాబ్జీకి మధ్య అసలు పడటం లేదు. నియోజకవర్గానికి సుప్రీం తానే అన్నట్లుగా ఎమ్మెల్యే వ్యవహరిస్తుంటే.. ఆయన్ను కాదని టీడీపీ ఇన్చార్జ్ సొంతంగా లీడర్లతో, అధికార యంత్రాంగంతో సమావేశాలు నిర్వహించడం ఇక్కడ దుమారం రేపుతోంది.
తనను కాదని పనులు ఎలా చేస్తారంటూ బొలిశెట్టి బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతుండగా, టీడీపీ శ్రేణులు కూడా తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఇరు పార్టీల పెద్దలకు ఇప్పటికే ఈ వ్యవహారంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందాయి.
ఇక ఉంగుటూరు విషయానికి వస్తే ఇక్కడ రాజకీయం కాస్త ఆర్థిక రూపాన్ని సంతరించుకుంది. జనసేన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుకు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు వర్గానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మట్టి తవ్వకాల దగ్గర నుంచి మద్యం వ్యాపారాల వరకు ప్రతి దాంట్లోనూ టీడీపీ నేతలే పెత్తనం చలాయించాలని చూస్తున్నారని జనసేన కేడర్ మండిపడుతోంది.
వ్యాపారాల్లో వాటాలు, క్షేత్రస్థాయిలో అధికారం కోసం ఇరు వర్గాలు పోటీ పడుతుండటంతో అసలైన కార్యకర్తలు గందరగోళంలో పడిపోయారు. తాము త్యాగాలు చేసి గెలిపిస్తే తమకే ప్రాధాన్యత లేదంటూ ఇరు పార్టీల శ్రేణులు రోడ్డెక్కుతున్నాయి.
కూటమికి అత్యంత కీలకమైన భీమవరం నియోజకవర్గంలో కథ మరోలా ఉంది. ఎన్నికల ముందు టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) తీరుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తోంది.
ఆయన కేవలం తన వెంట వచ్చిన వలస వర్గానికే పెద్దపీట వేస్తున్నారని, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడిన పాత కాపులను విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు నియోజకవర్గంలో పేకాట క్లబ్బుల వ్యవహారాలు, అవినీతి ఆరోపణలు వినవస్తుండటం కూటమి ఇమేజ్ను డ్యామేజ్ చేస్తోంది. ఇక్కడ కూడా ఎవరి దారి వారిదే అన్నట్లుగా నేతలు విడిపోయారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో తమ్ముళ్లు, జనసైనికుల మధ్య సాగుతున్న ఈ అంతర్యుద్ధంపై అధిష్టానం దృష్టి సారించింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ ప్రభావం పడితే కూటమికి పెద్ద దెబ్బ తగులుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.
“మిత్రపక్షాల మధ్య యుద్ధం ఏంటి?” అంటూ ఇద్దరు నేతలూ సదరు నియోజకవర్గాల ఇన్చార్జ్లు, ఎమ్మెల్యేలపై సీరియస్ అయినట్లు సమాచారం. గీత దాటితే ఎంతటి వారినైనా పక్కన పెట్టేందుకు వెనుకాడబోమని, త్వరలోనే ఇరు పార్టీల సమన్వయ కమిటీలతో జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ కుంపట్లకు చెక్ పెట్టాలని ఇద్దరు పెద్దలూ డిసైడ్ అయినట్లు టాక్. మరి ఈ వార్నింగ్లతోనైనా పశ్చిమ లీడర్లు దారుల్లోకి వస్తారో లేదో చూడాలి.
This post was last modified on June 12, 2026 11:33 pm
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…