విద్యాశాఖ మంత్రిగా టీడీపీ యువ నాయకుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్.. నారా లోకేష్ దూకుడు చూపిస్తున్నారు. నిజానికి విద్యా శాఖ అంటేనే చాలా సునిశితమైన శాఖ. అంతేకాదు.. సెంటిమెంటుతో పాటు.. అనేక సమస్యలు ఉన్న శాఖ కూడా. అయినా..తనకు నచ్చి-మెచ్చి ఈ శాఖను తీసుకున్న నారా లోకేష్.. రెండు సంత్సరాలు పూర్తిచేసుకున్నారు. నిజానికి విద్యాశాఖతోపాటు నారా లోకేష్ ఐటీ సహా మానవవనరుల శాఖను కూడా చూస్తున్నారు. దీంతో ఆయనపై పనిభారం ఎక్కువగానే ఉంది.
అయినప్పటికీ.. తనదైన శైలిలో విద్యాశాఖను నారా లోకేష్ ముందుకు నడిపిస్తుండడం గమనార్హం. వినూత్న కార్యక్రమాలతో పాటు.. అనేక అంశాల్లో ఉపాధ్యాయులను కూడా మెప్పిస్తున్నారు. 1) మెగా పేరెంట్స్ -మీటింగ్: కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. విద్యార్థులు-తల్లిదండ్రులను మమేకం చేస్తూ.. మెగా పేరెంట్స్ మీటింగ్స్ను కండక్ట్ చేస్తున్నారు. తద్వారా.. విద్యార్థులను నేరుగా మంత్రులు, ప్రజాప్రతినిధులు సీఎం సహా అందరూ కలుసుకుని.. వారిలో నూతన చైతన్యం తీసుకువస్తున్నారు. వైసీపీ హయాంలోనూ ఇది జరిగినా.. కేవలం ఉపాధ్యాయులకే పరిమితమైంది.
2) విలువల విద్య: ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమించుకున్న ప్రభుత్వం.. ఆయన ద్వారా విలువ విద్య అంశాన్ని నారా లోకేష్ వినియోగించుకుంటున్నారు. పాఠశాల విద్యార్థులకు నైతిక విలువలు నేర్పించడంతోపాటు.. వారిని సమున్నత మార్గంలో నడిపించేలా మంత్రి తీసుకున్న ఈ కార్యక్రమానికి 100 శాతం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సానుకూలత రావడం గమనార్హం.
3) ఉపాధ్యాయ బదిలీలు: వైసీపీ హయాంలో సీజ్ విధించిన ఉపాధ్యాయ బదిలీలను సులభతరం చేసిన ఘనత నారా లోకేష్కే దక్కుతుంది. ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరిన వెంటనే.. బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తద్వారా.. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న గురువులను సంతోషపెట్టారనే చెప్పాలి. అంతేకాదు.. ప్రతి జూన్లోనూ రెగ్యులర్గా బదిలీలు జరిగేలా ఉత్తర్వులు ఇవ్వడం రికార్డ్.
4) డీఎస్సీ: ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకునేవారు.. డీఎస్సీ కోసం ఎదురు చూస్తారు. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసిందన్న వాదన ఉంది. కానీ.. మంత్రిగా లోకేష్ బాధ్యతలు తీసుకున్నాక.. ఎన్నికల హామీ అయిన.. మెగా డీఎస్సీని నిర్విఘ్నంగా ముగించారు. అంతేకాదు.. ఎవరూ ఊహించని విధంగా ఏటా డీఎస్సీ వేస్తామని ప్రకటించి.. గత రెండు మాసాల కిందట జాబ్ క్యాలెండర్లో డీఎస్సీ పోస్టులను కూడా ప్రకటించడం విశేషం. ఇలా.. ఈ రెండేళ్ల పాలనలో విద్యాశాఖ మంత్రిగా 90 శాతంమేరకు విద్యార్థులను వారి తల్లిదండ్రులను కూడా లోకేష్ మెప్పించారనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
