శోక సంద్రంలో ‘విజయోత్సం’ వద్దబ్బా

ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన పరిస్థితుల్లో ధైర్యంగా ఎన్నికలకు వెళ్లి… అధికారం దక్కించుకున్న తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ లెక్కన కూటమి సర్కారు కొలువుదీరి రెండేళ్లు పూర్తి అయిన సమయాన… మూడు పార్టీల కూటమి విజయోత్సవాలు చేసుకోవాలి కదా. తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. అయితే విజయోత్సవాల ప్రారంభానికి ఓ రోజు ముందుగా ఏపీకే తలమానికంగా నిలుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగింది. 8 మంది కార్మికులు చనిపోయారు. వెరసి యావత్తు రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో విజయోత్సవం జరుపుకునేదెలా? నిజమే… రాష్ట్ర ప్రజలంతా శోక సంద్రంలో మునిగిన సమయంలో విజయోత్సవాలు అసలు వద్దే వద్దు. ఇదే మాట టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నోట నుంచి వినిపించింది. అనుకున్నంతనే ఆయన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు మాధవ్ తో ఇదే విషయాన్ని చెప్పారు. శోక సంద్రంలో విజయోత్సవాలు వద్దన్న చంద్రబాబు మాటకు ఆ ఇద్దరు నేతలు కూడా సానుకూలంగా స్పందించారు. ఫలితంగా మంగళవారం తిరుపతిలో జరగాల్సిన కూటమి విజయోత్సవ సభ రద్దైపోయింది.

కూటమి పాలనకు రెండేళ్లు నిండిన విషయాన్ని ఇటీవలే జరిగిన కూటమి సమన్వయ సమావేశంలో చర్చ జరిగింది. ప్రజలు గెలిపించిన కూటమి రెండేళ్ల తన పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తరుణాన్ని రాష్ట్ర ప్రజలంతా గుర్తుంచుకునేలా విజయోత్సవాలు జరుపుకోవాలని ఆ సమావేశంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విజయోత్సవాలను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్వహించాలని కూడా తీర్మానించారు. రాయలసీమలో తిరుపతి కేంద్రంగా తొలి సభ, ఉత్తరాంధ్ర సభను విశాఖలో, కోస్తాంధ్ర సభను అమరావతిలో నిర్వహించాలని నాడు నిర్ణయించారు.

విజయోత్సవం పేరిట జరగాల్సిన ఈ సభల్లో టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన కీలక నేతలంతా పాలుపంచుకోవాలన్న నిర్ణయం కూడా తీసుకున్నారు. ఫలితంగా రాష్ట్ర ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని విజయోత్సవ సభల ద్వారా ప్రతిఫలించేలా చేయాలన్న ప్లాన్ తో చంద్రబాబు వ్యూహం రచించారు. అయితే విశాఖ స్టిల్ ప్లాంట్ ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఈ వేడుకలను రద్దు చేయాలని స్వయంగా చంద్రబాబే నిర్ణయించడం గమనార్హం. నిజమే మరి… ఈ ప్రమాదం నేపథ్యంలో యావత్తు రాష్ట్ర ప్రజలు శోకసంద్రంలో మునిగిన వేళ… విజయోత్సవాలు నిర్వహించడం సరికాదు కదా. అందుకే చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారు.