పవన్ చెప్పినా అధికారులు వినట్లేదా…?

మన దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థలో అలసత్వం అంతకంతకూ పెరిగిపోతోంది. శాసన వ్యవస్త ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిన కీలకమైన బాధ్యత కలిగిన కార్యనిర్వహక వ్యవస్థ… కారణాలేమైనా గానీ ఆ పని మాత్రం చేయడం లేదు. ఈ విషయం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహారంలోనూ నిజమేనని తేలింది.

సాక్షాత్తు ఓ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ జారీ చేసిన ఆదేశాలను అధికారులు, ఆయా శాఖలు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. ఫలితంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్… తక్షణమే బాధ్యులపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.

గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించే నిమిత్తం ఇటీవలే ఓ మూడు రోజుల పాటు రాజమహేంద్రవరంలో బస చేసిన పవన్… అక్కడ గోదావరి తీరం వెంట ప్రత్యక్షంగా తిరిగి అక్కడి పరిస్ధితులను గమనించారు. ఈ సందర్భంగా పరిశ్రమల నుంచి, ఆయా కాలనీల నుంచి కాలుష్య కారకాలు, చెత్తా చెదారం గోదాట్లో కలుస్తున్న తీరును ఆయన గుర్తించారు.

ఇదేమిటని ఆయన స్థానిక అదికారులను ప్రశ్నించారు. ఈ కాలుష్యాలతో కలిసిన గోదారిలో పుష్కర స్నానం చేస్తే… పుణ్యం మాట దేవుడెరుగు… రోగాలు మాత్రం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగానే ఆయన ఆయా కాలుష్యాలకు కారణమైన వారికి నోటీసులు జారీ చేయాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు.

తాజాగా సోమవారం పవన్ తన శాఖలకు సంబందించి ఉన్నతాదికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తన రాజమహేంద్రవరం పర్యటనను ప్రస్తావించిన పవన్… నాడు తాను జారీ చేసిన ఆదేశాలను అధికారులు అమలు చేయలేదన్న విషయాన్ని గుర్తించారు.

ఆ వెంటనే ఇదేం పద్దతి అని ఆయన ఉన్నతాధికారులను నిలదీశారు. కాలుష్యాలకు కారణమవుతున్న సంస్థలపై చర్యలకు ఆదేశిస్తే… కనీసం నోటీసులు అయినా ఇవ్వాలి కదా అని ప్రశ్నించిన పవన్.. ఇప్పటిదాకా నోటీసులు కూడా జారీ కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోందని ఆయన ఒకింత అసంతృప్తికి గురయ్యారు.

కాలుష్యాలను శుద్దీకరించకుండానే గోదాట్లోకి వదిలేస్తున్న ఆంధ్రా పేపర్ మిల్లుకు ముందుగా నోటీసులు జారీ చేయాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఇప్పటిదాకా ఆ సంస్థకు నోటీసులు కూడా జారీ చేయని కాలుష్య నియంత్రణా మండలికి కూడా నోటీసులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు.

ఇక తన రాజమహేంద్రవరం పర్యటన సందర్భంగా తాను ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోని సంబంధిత శాఖ అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిజమేగా మరి… శాసన వ్యవస్థలో ఉన్న ఓ కీలక వ్యక్తి జారీ చేసిన ఆదేశాలను అమలు చేయని ప్రభుత్వ సంస్థలు, సంబందిత అదికారులకు వారివారి బాధ్యత గుర్తు చేస్తూ నోటీసులు జారీ చేయాల్సిందే కదా.