సాయిరెడ్దిని సిట్ ప్రశ్నలేమీ అడగలేదా..?

ఏపీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో గురువారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాడు వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డితో పాటు వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న కె.నాగేశ్వర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. విచారణ నిమిత్తం సిట్ కార్యాలయానికి వచ్చిన సాయిరెడ్డి… విచారణ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విచారణలో సిట్ అదికారులు తనను ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా అడగలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

సిట్ అదికారుల నుంచి విచారణకు రావాలన్న సమాచారం మేరకు తాను విచారణకు వచ్చానని పాయిరెడ్డి చెప్పారు. విచారణలో బాగంగా తన ఫోన్ డేలా కావాలని సిట్ అదికారులు కోరారని ఆయన చెప్పుకొచ్చారు. సిట్ అదికారులు కోరిన వెంటనే తన ఫోన్ ను వారికి అప్పగించానని, అందులో నుంచి అదికారులు తమకు కావాల్సిన సమాచారాన్ని కాపీ చేసుకున్నారని ఆయన తెలిపారు. ఆ తర్వాత తన ఫోన్ ను తనకు ఇచ్చేశారని, విచారణ ముగిసిందని వారు చెప్పగా… తాను వచ్చేశానని చెప్పారు. మొత్తంగా ఈ దఫా విచారణలో అదికారులు తనను ప్రశ్నలేమి అడగలేదని ఆయన చెప్పుకొచ్చారు.

వేలాది కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని భావిస్తున్న లిక్కర్ స్కాంలో ఇప్పటికే చాలా మంది మాజీ అదికారులు, వైసీపీ నేతలు, వైసీపీ తరఫున చక్రం తిప్పిన పలువురు వ్యక్తులను అరెస్టు చేసిన సిట్… ఈ కేసులో గుట్టుమట్లన్నీ విప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సిట్ విచారణకు సాయిరెడ్డి ఇప్పటికే పలుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా లిక్కర్ స్కాంలో కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డికే అన్ని వ్యవహారాలు తెలుసునని ఆది నుంచి చెబుతూ వస్తున్న సాయిరెడ్డి… గురువారం నాటి విచారణ తర్వాత కూడా అదే మాట చెప్పారు. అన్నీ రాజ్ కసిరెడ్డికే తెలుసునంటూ ఆయన పేర్కొన్నారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు.